Covid Cases Rise : మళ్లీ కరోనా కలవరం.. ఆ రాష్ట్రాలను హెచ్చరించిన కేంద్రం, కీలక సూచనలు

ప్రజలు గుంపులుగా ఉండే పరిస్థితిని నియంత్రించాలంది. ఆసుపత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది, రోగులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలంది.(Covid Cases Rise)

Covid Cases Rise : మళ్లీ కరోనా కలవరం.. ఆ రాష్ట్రాలను హెచ్చరించిన కేంద్రం, కీలక సూచనలు

Covid Cases Rise : దేశంలో మళ్లీ కరోనా కల్లోలం రేగింది. కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రోజువారీ కరోనా కేసుల్లో పెరుగుదల భయాందోళనకు గురి చేస్తోంది. కరోనా వ్యాప్తితో కేంద్రం అప్రమత్తమైంది. పలు రాష్ట్రాలకు హెచ్చరికలు, సూచనలు జారీ చేసింది కేంద్ర ఆరోగ్యశాఖ. అలాగే, ఎల్లుండి అన్ని రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. ఏప్రిల్ 10, 11 తేదీల్లో కరోనాపై కేంద్రం మాక్ డ్రిల్ నిర్వహించనుంది.

దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల పెరుగుదల కనిపిస్తోందని హెచ్చరించింది. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో కొత్త కేసులు అత్యధిక సంఖ్యలో నమోదవుతున్నాయని కేంద్రం వెల్లడించింది.

Also Read..Covid-19: మళ్లీ పెరుగుతున్న కోవిడ్.. దేశంలో 1500 దాటిన కేసులు.. ఐదు నెలల తర్వాత ఇదే మొదటిసారి

అయితే, కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నప్పటికీ, ఆందోళన కలిగించే పరిస్థితులేమీ లేవని స్పష్టం చేసింది. కరోనాతో ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య తక్కువగానే ఉందని వివరించింది. ఇన్ ఫ్లుయెంజా వ్యాధులు కూడా ఇప్పుడే ప్రబలుతున్నాయని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. పరిస్థితులను సమీక్షించి ప్రజలను రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం చేయాలని సూచించింది.

ఈ క్రమంలో రాష్ట్రాలకు పలు సూచనలు చేసింది కేంద్రం. ప్రజలు గుంపులుగా ఉండే పరిస్థితిని నియంత్రించాలంది. ఆసుపత్రుల్లో డాక్టర్లు, సిబ్బంది, రోగులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలంది. కరోనా టెస్టుల సంఖ్య పెంచి, కరోనా లక్షణాలపై ఎప్పటికప్పుడు నివేదికలు అందజేయాలంది.

Also Read..Lab Grown Meat : కృత్రిమ మాంసం.. ల్యాబ్ మీట్ పై సీసీఎంబీ పరిశోధనలు

దేశంలో మరోసారి కోవిడ్ వ్యాప్తి పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,590 కోవిడ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కోవిడ్ కేసులు ఈ స్థాయిలో పెరగడం దాదాపు 5 నెలల తర్వాత ఇదే మొదటిసారి. 146 రోజుల తర్వాత మళ్లీ ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయి.

ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం.. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 8,601గా ఉన్నాయి. డైలీ కోవిడ్ పాజిటివిటీ రేట్ 1.33 కాగా, వీక్లీ పాజిటివిటీ రేట్ 1.23గా ఉంది. దేశంలో ఇప్పటివరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 4,47,02,257. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,62,832. కోవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 5,30,824. మరణాల శాతం 1.19. గడిచిన 24 గంటల్లో కోవిడ్‌తో ఆరుగురు మరణించారు. మహారాష్ట్రలో ముగ్గురు, కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరాఖండ్‌లలో ఒక్కరు చొప్పున కోవిడ్ తో మరణించారు. యాక్టివ్ కేసుల శాతం 0.02కాగా, రికవరీ రేటు 98.97గా ఉంది.

Also Read..India Covid : దేశంలో మళ్లీ కరోనా విజృంభణ.. కొత్తగా 1,249 కేసులు నమోదు

దేశంలో 220.65 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, గుజరాత్‌లతో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో ప్రస్తుతం ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ ఎక్స్ బీబీ.1.16 రకం వైరస్ వ్యాపిస్తోంది. అయితే, ఇది అంతగా ప్రమాదకరం కాదని నిపుణులు అంటున్నారు.