కరోనా ఆస్పత్రిని సందర్శించిన అమిత్ షా,రాజ్ నాథ్ సింగ్
కరోనా పాజిటివ్ రోగులకు సేవలందించేందుకు DRDO ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 1000 పడకల కోవిడ్ ఆస్పత్రిని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆదివారం మధ్యాహ్నం సందర్శించారు. వీరికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, డీఆర్డీఓ చైర్మన్ సతీశ్రెడ్డి స్వాగతం చెప్పారు.
అనంతరం అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లు ఆస్పత్రి మొత్తం కలియ దిరిగి అక్కడ ఏర్పాటు చేసిన వైద్య సౌకర్యాలను పరిశీలించారు. ఎన్ని పడకలు, వార్డులు, ఐసీయూలు ఎన్ని ఉన్నాయో డీఆర్డీఓ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ ఆస్పత్రి లోని వార్డులకు లడఖ్ ఘర్షణలో ప్రాణాలు విడిచిన భారత సైనికుల పేర్లు పెట్టాలని నిశ్చయించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఆస్పత్రిలోని ఐసీయూ, వెంటిలేటర్ వార్డుకు కల్నల్ సంతోష్ బాబు పేరు పెట్టారు.