CAAపై అన్నాడీఎంకే యూటర్న్..బీజేపీ పరేషాన్
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేళ మిత్రపక్షం బీజేపీకి షాక్ ఇచ్చింది అన్నాడీఎంకే. పౌరసత్వ చట్టం(CAA)పై అన్నాడీఎంకే తన వైఖరిని మార్చుకుంది.
AIADMK manifesto తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల వేళ మిత్రపక్షం బీజేపీకి షాక్ ఇచ్చింది అన్నాడీఎంకే. పౌరసత్వ చట్టం(CAA)పై అన్నాడీఎంకే తన వైఖరిని మార్చుకుంది. పార్లమెంటులో పౌరసత్వ చట్టానికి(సీఏఏ) అనుకూలంగా ఓటేసిన అన్నాడీఎంకే.. ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో సీఏఏ అమలును నిలిపివేసేలా కేంద్రాన్ని ఒప్పిస్తామని హామీ ఇచ్చింది. అయితే ఎన్నికలకు ముందు సీఏఏపై అధికార పార్టీ వాగ్దానం మాత్రం..బీజేపీకి చికాకు, చిక్కులు తెప్పిస్తోంది. దీనిపై ముందుకెళ్లడం అధికార పార్టీకి అంత సులువేం కాదు. సీఏఏను రద్దు చేయాలని.. కేంద్రాన్ని ఎలా ఒప్పిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది.
తమిళనాడు సీఎం, అన్నాడీఎంకే ఉమ్మడి సమన్వయకర్త ఎడప్పాడి పళనిస్వామి సోమవారం జరిగిన ఓ సమావేశంలో…బీజేపీతో పొత్తు ఎన్నికల వరకే పరిమితమని, సైద్ధాంతికంగా కాదని స్పష్టం చేశారు. మైనార్టీలు తమను విజ్ఞప్తి చేశారని.. ఆ విజ్ఞప్తి మేరకు తాము ఎన్నికల్లో గెలిస్తే సీఏఏపై పునరాలోచించాలని కేంద్రాన్ని కోరుతామని పళనిస్వామి తెలిపారు. ఈ విషయమై తాము హామీ ఇస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రకటన బీజేపీకి షాక్కు గురి చేసింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సీఏఏ చట్టాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ చట్టం తప్పనిసరిగా అమలుచేయాలని భావిస్తోంది. ఈ సమయంలో అన్నాడీఎంకే తీసుకున్న ఈ నిర్ణయం బీజేపీకి నష్టం చేకూరుస్తుందని తెలుస్తోంది.
మేనిఫెస్టోలో అన్నాడీఎంకే వాగ్ధానంపై మంగళవారం తమిళనాడు పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి వీకే సింగ్ మాట్లాడుతూ..ఒకసారి వారు (AIADMK) మాతో కూర్చున్న తర్వాత, వారు ఏమి ఆలోచిస్తున్నారో మేము కనుక్కుంటాము. సరైన వ్యాఖ్యానాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే విషయాలు సరి అవుతాయి అని వీకే సింగ్ వ్యాఖ్యానించారు.
మరోవైపు, తమిళ భాషకు ప్రాధాన్యం దక్కేలా మద్రాస్ హైకోర్టును తమిళనాడు హైకోర్టుగా పేరు మార్పు, చెన్నైలో సుప్రీం కోర్టు బెంచ్ ఏర్పాటు హామీని కూడా మేనిఫెస్టోలో చేర్చింది అన్నాడీఎంకే. శ్రీలంక శరణార్థులకు ద్వంద్వ పౌరసత్వం కల్పిస్తామని అధికార పార్టీ హామీ ఇవ్వగా.. డీఎంకే సైతం అలాంటి వాగ్దానమే చేసింది. లంక తమిళుల అంశం.. ద్రవిడ పార్టీల రాజకీయ ప్రధాన అంశాల్లో ఎప్పటినుంచో ఉంది. ఈ ఎన్నికలు దీనికేం మినహాయింపు కాదు. దానికి తగ్గట్లుగానే మేనిఫెస్టోల్లో సంబంధిత అంశాలను పొందుపర్చాయి. భారత్లో ఉండాలనుకునేవారికి.. భారత పౌరసత్వం, శాశ్వత నివాస హోదా హామీపైనా రెండు పార్టీలు దాదాపు ఒకే అభిప్రాయంతో ఉన్నాయి.
Once they (AIADMK) sit down with us, we’ll find out what they are thinking of. Once correct interpretation is taken into account things will become alright: Union Min VK Singh on AIADMK manifesto mentioning that if they win polls they’ll ask Centre to rethink CAA pic.twitter.com/haj1TGIaeT
— ANI (@ANI) March 16, 2021