కేంద్రమంత్రి బాబుల్ సుప్రియోకు రెండోసారి కరోనా
దేశంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది.
Babul Supriyo దేశంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది మంది కరోనా బారిన పడుతుండగా.. వేలాది మంది మరణిస్తున్నారు. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు ప్రతిఒక్కరూ కోవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా కేంద్రమంత్రి బాబుల్ సుప్రియోకు రెండోసారి కరోనా వైరస్ సోకింది. తనతోపాటు తన భార్యకు కూడా కరోనా వచ్చిందని ఆదివారం(ఏప్రిల్-25,2021)బాబుల్ సుప్రియో ట్విట్టర్ ద్వారా తెలిపారు.
కరోనా సోకడంతో…ఈ నెల 26న జరిగే అసన్సోల్ ఎన్నికల్లో నా ఓటు హక్కు వినియోగించ లేకపోతున్నాను.. చాలా బాధగా ఉంది అని బాబుల్ సుప్రియో ట్వీట్ చేశారు. అయితే మానసికంగా బీజేపీ అభ్యర్థులతోనే ఉంటానని, ఇంటి నుంచే ఓటింగ్ తీరును పరిశీలిస్తానని వెల్లడించారు.
కాగా, బాబుల్ సుప్రియో అసన్సోల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆయన తాజాగా టోలీగంజ్ నియోజకవర్గం నుంచి పోటీకి దిగారు. కాగా పశ్చిమ బెంగాల్లో ఇప్పటివరకూ 6 విడతల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. ఇంకా రెండు విడతల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. సోమవారం(ఏప్రిల్-26,2021) ఏడో విడతలో భాగంగా మరో 36 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ జరుగనుంది.