తేలిపోనున్న సచిన్ పైలట్ భవితవ్యం, గజేంద్ర షెకావత్ కు పోలీసుల నోటీసులు
రాజస్థాన్ కాంగ్రెస్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్ భవితవ్యం తేలిపోనుంది. అసెంబ్లీ స్పీకర్ జారీ చేసిన అనర్హత షోకాజ్ నోటీసులను సవాల్ చేస్తూ సచిన్ పైలట్ వర్గం హైకోర్టును ఆశ్రయించింది. దీంతో రాజస్థాన్ హైకోర్టు స్పీకర్ అనర్హత షోకాజ్ నోటీసులపై నేటి వరకు స్టే విధించింది.
నోటీసులపై విచారణ : –
దీంతో 2020, జులై 20వ తేదీ సోమవారం మరోసారి స్పీకర్ ఇచ్చిన షోకాజ్ నోటీసులపై విచారణ జరుగనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు హైకోర్టు విచారించనుంది. దీంతో రాజస్థాన్ హైకోర్టు సచిన్ వర్గం ఎమ్మెల్యేలపై ఎలాంటి నిర్ణయం తీర్పు ఇస్తుందన్న ఉత్కంఠ నెలకొంది.
షెకావత్ పై ఆరోపణలు : –
మరోవైపు రాజస్థాన్ ఎమ్మెల్యేలను కొనుగోలుచేసేందుకు కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రయత్నించారని ఆరోపించిన కాంగ్రెస్, అందుకు ఆధారంగా ఫోన్ సంభాషణల రికార్డులను కూడా శుక్రవారం బయటపెట్టింది. దీంతో 2020, జులై 20వ తేదీన సోమవారం రాజస్థాన్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
పోలీసుల నోటీసులు : –
ఆడియో టేపు వ్యవహారంలో నోటీసులు ఇచ్చారు. ఆయన ఇంటికి నోటీసులు పంపారు. అయితే ఈ టేపులే ఆధారంగా రాజస్థాన్ సంక్షోభంలోకి కేంద్రం నేరుగా ప్రవేశించింది. తమ ఫోన్లను గెహ్లాట్ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తున్నదని బీజేపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై కేంద్ర హోంశాఖ రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీచేసింది.
వసుంధర రాయబారం : –
8 నెలల క్రితమే బీజేపీ నేత సంజయ్జైన్ ద్వారా మాజీ సీఎం వసుంధర తన రాయబారం పంపి ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేంద్ర గూడా ఆరోపించారు. జైన్తో పాటు మరికొందరు మధ్యవర్తులు కూడా గెహ్లాట్ సర్కార్ను కూల్చేందుకు ప్రయత్నించారని చెప్పారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదని అన్నారు. సంజయ్ జైన్ చాలాకాలంగా ఇదే పనిలో ఉన్నారని ఆయన ఆరోపించారు.
గెహ్లాట్ బలప్రదర్శన : –
ఇదిలా ఉంటే…రాజస్థాన్ సీఎం అశోక్గెహ్లాట్ అసెంబ్లీలో బలప్రదర్శనకు సిద్ధమయ్యారు. సచిన్ పైలట్ తిరుగుబాటుతో ప్రభుత్వం మైనారిటీలో పడిందన్న విపక్షాల విమర్శలకు సభలోనే సమాధానం చెప్పాలని సీఎం నిర్ణయించినట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వానికి మద్దతిస్తున్న భారతీయ ట్రైబల్ పార్టీ ఇక తామే కింగ్మేకర్స్మని ప్రకటించింది.
గవర్నర్ కు ఎమ్మెల్యేల జాబితా : –
తిరుగుబాటు నేత సచిన్ పైలట్ను ఆత్మరక్షణలోకి నెట్టిన సీఎం అశోక్గెహ్లాట్ వెంటనే అసెంబ్లీలో తన ప్రభుత్వ బలాన్ని నిరూపించుకోవాలని నిర్ణయించారు. ఒకటి రెండు రోజులు అసెంబ్లీని సమావేశపర్చనున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. శనివారం సాయంత్రం రాష్ట్ర గవర్నర్ కల్రాజ్మిశ్రాను కలిసిన సీఎం, తనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేల జాబితాను అందజేసినట్టు తెలుస్తోంది.
షెకావత్ రాజీనామా చేయాలి : –
అసెంబ్లీలో బలనిరూపణ ఎప్పుడు, ఎలా అన్నది సీఎం నిర్ణయిస్తారు. అసలు ఫ్లోర్ టెస్ట్ అవసరమా కాదా అన్నదానిపైనా ఆయనే నిర్ణయం తీసుకుంటారని కాంగ్రెస్ నేత అజయ్మాకెన్ తెలిపారు. హార్స్ట్రేడింగ్కు ప్రయత్నించిన కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
107 మంది ఎమ్మెల్యేల మద్దతు : –
200 మంది సభ్యులున్న సభలో తనకు 107మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని సీఎం అశోక్ గెహ్లాట్ చెబుతున్నారు. సీపీపీం, బీటీపీ ప్రభుత్వానికి మద్దతిస్తున్నాయి. ఈ రెండు పార్టీలకు ఇద్దరేసి సభ్యులున్నారు. గెహ్లాట్ సర్కారుకు మద్దతు ప్రకటించిన బీటీపీ అధినేత మహేశ్భాయ్ సీ వాసవ, సభలో బలపరీక్ష జరిగితే తామే కింగ్మేకర్ అవుతామని తెలిపారు.
22న బలపరీక్ష : –
మరోవైపు గెహ్లాట్ మాత్రం ఈనెల 22న బలపరీక్షను ఎదుర్కోవాలని సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ బలపరీక్ష కోసం బుధవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని గెహ్లాట్ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తిరుగుబాటు ఎమ్మెల్యే బన్వర్లాల్ శర్మను విచారించేందుకు రెండోసారి ఆదివారం హర్యానాలోని మనేసర్ వెళ్లిన రాజస్థాన్ పోలీసులను హోటల్ సిబ్బంది లోపలికి రానీయలేదు. జైపూర్లో లగ్జరీ హోటల్లో క్యాంపు వేసిన గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలు అంత్యాక్షరి ఆడుతూ, సినిమాలు చూస్తూ జల్సా చేస్తున్నారు.