UP Accident : లోయలో పడిన ట్రక్..11మంది మృతి..
UP Accident ఉత్తరప్రదేశ్లో ఘోర ప్రమాదం సంభవించింది. ఇటావా జిల్లా రవెనెలో అదుపు తప్పిన డీసీఎం వాహనం లోయలోకి దూసుకెళ్లడంతో 11 మంది దుర్మరణం చెందారు. మరో 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. గాయాలు తీవ్రంగా అవ్వటంతో వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.
బద్పుర పోలీస్స్టేషన్ పరిధిలోని రవెనె ప్రాంతంలో డీసీఎం ట్రక్కు 50 మందికి పైగా ప్రయాణికులను వేసుకుని వెళ్తోంది. వాహనం సామర్థ్యానికి మించి జనాలను ఎక్కించడంతో ట్రక్కు నియంత్రణ కోల్పోయి చక్కర్నగర్ రోడ్డులోని లోయ ప్రాంతంలో లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారని స్థానిక అదనపు ఎస్పీ ప్రశాంత్కుమార్ ప్రసాద్ తెలిపారు.
ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయాలు అయినవారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల నష్ట పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.