హత్రాస్ లో మరో దారుణం…. ఆరేళ్ళ అత్యాచార బాధితురాలు మృతి
up:ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ జిల్లాలో ఇటీవల జరిగిన సామూహిక హత్యాచార ఘటన మరువక ముందే…. అదే జిల్లాకు చెందిన మరో బాలిక అత్యాచారానికి గురై మరణించటం కలకలం రేపింది. హత్రాస్ జిల్లాకు చెందిన మరో బాలిక పొరుగున ఉన్న అలీగఢ్ జిల్లాలో మేన మామ కోడుకు చేతిలో బలయ్యింది.
హత్రాస్ జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన వ్యక్తి భార్య మరణించటంతో తన ఆరేళ్ల చిన్నారిని ఆలీగడ్ జిల్లా, ఇగ్లాస్ లో ఉండే మేనమామ ఇంటికి ఏడాది క్రితం పంపించారు. అక్కడ మేనమామ కొడుకు(15) చిన్నారిపై 2020, సెప్టెంబర్ 17న అత్యాచారం చేశాడు. అందుకు అతని తల్లి కూడా సహకరించింది. బాలిక ఈవిషయాన్ని తండ్రికి చెప్పటంతో ఆయన సెప్టెంబర్ 21 న పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా ….బాలికపై అత్యాచారం జరగటం వలన ఆరోగ్యం క్షీణించింది. దీంతో తండ్రి ఆమెను హత్రాస్ లోని జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. ఆమె ఆరోగ్య పరిస్ధితి విషమించటంతో అక్టోబర్ 1న ఢిల్లీలోని సఫ్దర్ జంగ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ మృత్యువుతో పోరాడుతూ అక్టోబర్ 5 సోమవారం తుదిశ్వాస విడిచింది.
ఇప్పటికే కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అందుకు సహకరించిన తల్లి పరారీలో ఉండటంతో ఆమెకోసం రెండు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి.
నిందితుడి తల్లిని అరెస్ట్ చేయడంలో పోలీసు అధికారులు విఫలమయ్యారంటూ బాధితురాలి బంధువులు మంగళవారం హథ్రాస్ లోని సదాబాద్-బల్దేవ్ ప్రధాన రహదారిపై మృతదేహంతో నిరసన చేపట్టారు. పోలీసు అధికారుల సర్ది చెప్పటంతోవారు నిరసన విరమించి బాలిక అంత్యక్రియలునిర్వహించారు. కేసు విచారణలో నిర్లక్ష్యం వహించిన ఇగ్లాస్ పోలీస్ స్టేషన్ SHO ను అలీగడ్ SSP జి. మునిరాజ్ సస్పెండ్ చేశారు.