Civil Services 2020 Results : సివిల్స్ ఫలితాలు విడుదల
సివిల్ సర్వీసెస్-2020 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. యూపీఎస్సీ శుక్రవారం విడుదల చేసిన సివిల్ సర్వీసెస్ పరీక్షల ఫలితాల్లో...శుభమ్ కుమార్ ఆల్ ఇండియా టాపర్గా నిలిచాడు.
Civil Services 2020 Results సివిల్ సర్వీసెస్-2020 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. యూపీఎస్సీ శుక్రవారం విడుదల చేసిన సివిల్ సర్వీసెస్ పరీక్షల ఫలితాల్లో…శుభమ్ కుమార్ ఆల్ ఇండియా టాపర్గా నిలిచాడు. జాగృతి అవస్థి, అంకితా జైన్ వరుసగా రెండు, మూడో స్థానాల్లో నిలిచారు. ఈ ఫలితాల్లో తొలి 25మంది జాబితాలో 13 మంది అబ్బాయిలు కాగా.. 12 మంది అమ్మాయిలు ఉన్నారు. తొలి ర్యాంకు సాధించిన శుభం కుమార్ ఐఐటీ బాంబేలో సివిల్ ఇంజినీరింగ్లో బీటెక్ పూర్తి చేశారు. రెండో ర్యాంకు సాధించిన జాగృతి అవస్థీ భోపాల్ నిట్లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో బీటెక్ పట్టా పుచ్చుకుంది.
ఇక తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు మంచి ఫలితాలే సాధించారు. నలుగురికి 100లోపు ర్యాంకులు వచ్చాయి. శ్రీజ 20వ ర్యాంకు, మైత్రేయి నాయుడు- 27, రవికుమార్ -84, యశ్వంత్ కుమార్రెడ్డికి 93వ ర్యాంకు వచ్చింది. మరో ఆరుగురికి 800 లోపు ర్యాంకులు వచ్చాయి. కె.సౌమిత్ రాజు 355వ ర్యాంకు, తిరుపతి రావు 441, ప్రశాంత్ సూరపాటి 498, ఇ వేగిని 686వ ర్యాంకు, డి. విజయ్ బాబు 682వ ర్యాంకు, కళ్లం శ్రీకాంత్రెడ్డి 747వ ర్యాంకును దక్కించుకున్నారు.
అఖిల భారత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులను ఎంపిక చేసేందుకు సివిల్ సర్వీసెస్ పరీక్షను యూపీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ దశల్లో అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. కరోనా పరిస్థితుల నడుమ 2020 సెప్టెంబర్లో మెయిన్స్ పరీక్షలను యూపీఎస్సీ నిర్వహించింది. 2021 ఫిబ్రవరి నుంచి ఆగస్టు వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూలో నెగ్గి మొత్తం 761 మంది అభ్యర్థులు వివిధ సర్వీసులకు ఎంపికైనట్లు యూపీఎస్సీ తెలిపింది. వీరిలో 545 మంది పురుష అభ్యర్థులు కాగా.. 216 మంది మహిళా అభ్యర్థులు.