Mansukh Mandaviya : వ్యాక్సిన్ల కొరతపై..నేతల ప్రకటనలపై ఆరోగ్యమంత్రి సీరియస్
కోవిడ్ వ్యాక్సిన్ల కొరతపై కొందరు రాజకీయ నేతలు ఇష్టారీతిన చేసే వ్యాఖ్యలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించేలా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవియా అన్నారు.
Mansukh Mandaviya కోవిడ్ వ్యాక్సిన్ల కొరతపై కొందరు రాజకీయ నేతలు ఇష్టారీతిన చేసే వ్యాఖ్యలు ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించేలా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవియా అన్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ వరుస ట్వీట్ లు చేశారు. ఎప్పుడు,ఎంత మొత్తంలో డోసులు అందుకోబోతున్నారనే విషయం రాష్ట్రాలకు బాగా తెలుసని యాండవియా అన్నారు.
పంపిణీ చేసే వ్యాక్సిన్ డోసుల వివరాల గురించి కేంద్రప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ముందస్తు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. వ్యాక్సిన్ల లభ్యతపై వివిధ రాష్ట్రాలు, నేతలు రాస్తున్న లేఖలు, ప్రకటనలను మంత్రి ప్రస్తావిస్తూ.. వాస్తవాలను సరిగ్గా విశ్లేషించడం ద్వారా పరిస్థితిని మెరుగ్గా అర్ధం చేసుకోగలుగుతామన్నారు. అర్ధరహిత ప్రకటనలు ప్రజల్లో భయాందోళన రేకెత్తిస్తాయని మన్సుక్ మాండవియా తన ట్వీట్ లో పేర్కొన్నారు.
జూన్ నెలలో రాష్ట్రాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు 11.46 కోట్ల వ్యాక్సిన్ డోసులు సరఫరా చేయగా, జులైలో వీటి సంఖ్య 13.50 కోట్లకు పెరిగిందని ఆరోగ్యమంత్రి చెప్పారు. జులైలో ఎన్ని వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉంటాయని జూన్ 27నే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సమాచారమిచ్చిందన్నారు. వ్యాక్సిన్ లభ్యతకు అనుగుణంగా ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా క్షేత్రస్ధాయిలో వ్యాక్సిన్ పంపిణీని ప్రణాళికా బద్ధంగా రాష్ట్రాలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ముందస్తు సమాచారం చేరవేస్తోందని మన్సుక్ మాండవియా తన ట్వీట్ లో పేర్కొన్నారు.