Vaccine : వ్యాక్సిన్తోనే రక్షణ.. కరోనా సోకినా త్వరగా కోలుకుంటున్నారు, మరణాల సంఖ్య తక్కువ
కరోనాను కట్టడి చేయాలంటే వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కారం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా నుంచి రక్షణ కల్పించేది టీకా మాత్రమే అని అంటున్నారు. టీకా 2 డోసులు తీసుకున్న వారిలో వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుందన్నారు. అంతేకాదు కరోనా సోకినా త్వరగా కోలుకుంటారని చెప్పారు.
Vaccine : కరోనాను కట్టడి చేయాలంటే వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కారం అని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా నుంచి రక్షణ కల్పించేది టీకా మాత్రమే అని అంటున్నారు. టీకా 2 డోసులు తీసుకున్న వారిలో వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుందన్నారు. అంతేకాదు కరోనా సోకినా త్వరగా కోలుకుంటారని చెప్పారు.
వైరస్ బాధితులకు టీకాలు రక్షణ ఇస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. రెండు డోసులు పొందిన వారిలో పలువురు కొవిడ్ బారినపడినా స్వల్ప చికిత్సతోనే కోలుకుంటున్నారని చెబుతున్నారు. వీరిలో మరణాల సంఖ్య అతి తక్కువగా ఉన్నట్లు వివరిస్తున్నారు. ఐసీయూల్లో చేరి, వెంటిలేటర్ చికిత్స పొందాల్సిన పరిస్థితులు తలెత్తడం లేదంటున్నారు.
ప్రతి కొవిడ్ ఆసుపత్రిలో బాధితులకు చికిత్స అందించే వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బందిలో 10% మంది వరకు వైరస్ బారినపడుతున్నా..టీకా రెండు డోసులు పొందిన వారు త్వరగా కోలుకొని విధులకు హాజరవుతున్నారని సీనియర్ డాక్టర్ తెలిపారు. ఒకసారి కొవిడ్ సోకిన వారిలో సుమారు 5%లోపు వ్యక్తులు రెండోసారి కరోనా బారినపడుతున్నారని, అదే రెండు డోసులు టీకా పొందిన ఇలాంటి వారిలో ఇది ఒక శాతంలోపే ఉందన్నారు.
టీకాతో యాంటీబాడీల వృద్ధి:
కరోనా బారినపడి కోలుకున్న అనంతరం వారిలో సహజంగానే యాంటీబాడీలు వృద్ధి చెందుతాయి. 70% మందిలో ఇవి బాగా వృద్ధి చెందినట్లు కనిపిస్తుండగా 30% మందిలో అంతగా స్పందన కనిపించడం లేదని డాక్టర్లంటున్నారు. రెండు డోసులు టీకా పొందిన వారిలో 14 రోజుల తర్వాత పరిశీలిస్తే అత్యధిక మందిలో యాంటీబాడీలు వృద్ధి చెందాయని చెబుతున్నారు. ఇవి బాగా వృద్ధి చెందితే కరోనా నుంచి 80శాతం వరకు రక్షణ లభించినట్లేనని వివరిస్తున్నారు.
యాంటీబాడీలు వృద్ధి చెందని వారు, ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడిన వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందని, షుగర్, క్యాన్సర్, మూత్రపిండాల రోగులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి మళ్లీ మళ్లీ ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఎక్కువని, అలాంటి వారు తప్పక టీకా తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.