రాళ్ల దెబ్బలు, నిలువెల్లా గాయాలు, చుట్టూ శత్రు బలగాలు.. అయినా వెనక్కి తగ్గలేదు.. కల్నల్ సంతోష్ బాబు శౌర్య పరాక్రమం

తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో ఈ నెల 15న చైనా బలగాలు దొంగ దాడి చేసిన సంగతి తెలిసిందే. వారితో

రాళ్ల దెబ్బలు, నిలువెల్లా గాయాలు, చుట్టూ శత్రు బలగాలు.. అయినా వెనక్కి తగ్గలేదు.. కల్నల్ సంతోష్ బాబు శౌర్య పరాక్రమం

తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో ఈ నెల 15న చైనా బలగాలు దొంగ దాడి చేసిన సంగతి తెలిసిందే. వారితో

తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో ఈ నెల 15న చైనా బలగాలు దొంగ దాడి చేసిన సంగతి తెలిసిందే. వారితో జరిగిన హింసాత్మక ఘర్షణలో భారత సైన్యానికి చెందిన కల్నల్‌ సంతోష్‌ బాబు సహా 20 మంది సైనికులు వీర మరణం పొందారు. నాటి ఘటనకు సంబంధించిన వివరాలను ఆర్మీ వర్గాల ద్వారా తాజాగా వెలుగులోకి వచ్చాయి. దేశం కోసం ప్రాణాలర్పించిన తెలంగాణ ముద్దు బిడ్డ, సూర్యాపేట వాసి కల్నల్‌ సంతోష్‌బాబు, ఆయన నేతృత్వంలోని మన బలగాలు సాగించిన వీరోచిత పోరాటం వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి.

తీవ్రంగా గాయపడినా వెనక్కి తగ్గని సంతోష్ బాబు:
అప్పటికే శరీరంపై తీవ్ర గాయాలు.. చుట్టూ పెద్ద సంఖ్యలో శత్రు బలగాలు.. తన దగ్గర చాలా తక్కువ మంది సైనికులు.. అయినా వెనక్కి తగ్గకుండా సింహంలా గర్జించాడు ఆ తెలుగు యోధుడు. వంద మందితోనే 350 మంది ఉన్న శత్రువుతో పోరు సాగించాడు. శత్రుమూక దురాఘతంపై చివరివరకు పోరాడుతూ భరతమాత రక్షణలో అమరుడయ్యాడు. మృత్యు ముఖంలోనూ ఆయన ప్రదర్శించిన అద్భుత నాయకత్వ పటిమ, పోరాట స్ఫూర్తి చిరస్మరణీయం. ఆయనే కల్నల్‌ సంతోష్‌ బాబు.

16-బిహార్‌ బెటాలియన్‌కు కమాండింగ్ ఆఫీసర్ గా సంతోష్ బాబు:
గల్వాన్ ప్రాంతంలో ఇండియన్‌ ఆర్మీ 16 బిహార్‌ బెటాలియన్‌కు సంతోష్‌ బాబు కమాండింగ్‌ ఆఫీసర్‌ (సీఓ)గా వ్యవహరిస్తున్నారు. నెల రోజులుగా సాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల రెండు దేశాలూ పోటాపోటీగా అక్కడికి బలగాలను తరలించాయి. అక్కడ వేడిని చల్లార్చేందుకు జూన్ 6న రెండు దేశాల లెఫ్టినెంట్‌ జనరల్‌ స్థాయి సైనికాధికారుల మధ్య చర్చలు జరిగాయి. అందులో కుదిరిన ఒప్పందం ప్రకారం.. రెండు దేశాలు తమ సరిహద్దుల నుంచి అదనపు బలగాలను వెనక్కి తరలించాలి. ఇందులో భాగంగా గల్వాన్‌ లోయలోని పెట్రోలింగ్‌ పాయింట్‌-14 (పీపీ-14) నుంచి చైనా సైనిక ఉపసంహరణ జరగాలి. దీన్ని పర్యవేక్షించే బాధ్యతను భారత సైనిక నాయకత్వం.. కల్నల్‌ సంతోష్‌ నేతృత్వంలోని ‘16 బిహార్‌’ దళానికి అప్పగించింది.

ఖాళీ చేసినట్లే చేసి మళ్లీ వచ్చిన చైనా సైనికులు:
చైనా సైనికులు తొలుత ఆ ప్రాంతాన్ని ఖాళీ చేశారు. తమ శిబిరాలనూ తొలగించారు. ఈ అంశంపై స్థానిక చైనా కమాండర్‌తో కల్నల్‌ సంతోష్‌ బాబు చర్చలు కూడా జరిపారు. అయితే అకస్మాత్తుగా జూన్ 14న చైనా సైన్యం అక్కడ ఒక సరిహద్దు పరిశీలన కేంద్రాన్ని, మరికొన్ని గుడారాలను ఏర్పాటుచేసింది. ఒప్పందం మేరకు దీన్ని తొలగించాలన్న సందేశంతో చిన్న గస్తీ బృందాన్ని ‘16 బిహార్‌’ దళం పంపింది. డ్రాగన్‌ దళాలు దీనికి ససేమిరా అన్నాయి. మన గస్తీ బృందం ఈ విషయాన్ని సంతోష్‌ బాబుకు తెలిపింది. భారత బృందం వచ్చి వెళ్లాక.. చైనా సైనికులు అక్కడికి భారీగా అదనపు బలగాలను రప్పించారు.

రంగంలోకి సంతోష్‌ బాబు:
చైనా శిబిరాన్ని ఖాళీ చేయించేందుకు సంతోష్‌ బాబు స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన నేతృత్వంలోని బృందం జూన్ 15న చైనా శిబిరం దగ్గరికి వెళ్లింది. అక్కడ స్థానిక చైనా బలగాలు కాకుండా కొత్త ముఖాలు ఉన్నట్లు ఆయన గుర్తించారు. అదనపు బలగాలను చైనా పంపినట్లు ఆయన పసిగట్టారు. వారితో ఎంతో మర్యాదగా మాట్లాడారు. అబ్జర్వేషన్‌ పోస్ట్‌, ఇతర గుడారాలను ఏర్పాటు చేయడం అక్రమమని చైనా కమాండర్‌కు స్పష్టం చేశారు. అయితే చైనా సైనికుడొకరు సంతోష్ ను బలంగా వెనక్కి తోసేశాడు.

మన సైనికుల్లో ఆగ్రహం:
తమ ‘సీవో సాబ్‌’పై జులుం ప్రదర్శించడంతో భారత సైనికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చైనా సైనికులపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డారు. ఈ పోరు అర గంటపాటు సాగింది. ఇరుపక్షాలకు చెందిన అనేక మంది గాయపడ్డారు. అంతిమంగా మన బలగాలదే పైచేయి అయింది. భారత సైనికులు.. చైనా గుడారాలను నేలకూల్చడమే కాకుండా, వాటిని కాల్చి బూడిద చేశారు. గత్యంతరం లేక డ్రాగన్‌ దళాలు వెనుదిరిగాయి.

వెనకడుగు వేయని తెలుగు వీరుడు:
ఈ పోరులో కర్నల్‌ సంతోష్‌ తీవ్రంగా గాయపడ్డారు. అయినా వెనక్కి వెళ్లేందుకు ఆయన నిరాకరించారు. ఘటనా స్థలంలోనే ఉండిపోయారు. తన బలగాన్ని ముందుండి నడిపించారు. గాయపడిన భారత సైనికులను వెనక్కి పంపారు. అదనపు బలగాలను రప్పించారు. ఘర్షణ కారణంగా అక్కడ తీవ్ర స్థాయిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొద్దిసేపటి తర్వాత చైనా సైనికులు పెద్ద సంఖ్యలో అదనపు బలగాలతో అక్కడికి చేరుకున్నారు. పొడవైన మేకులు కలిగిన ఇనుప రాడ్లతో మన బలగాలపై దాడి చేశారు. భారత సైనికులు బాయ్‌నెట్‌లతో ఎదుర్కొన్నారు. తమ కన్నా చైనా సైనికులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ కల్నల్‌ సంతోష్‌బాబు నాయకత్వంలో భారత బలగాలు భీకర పోరాటం చేశాయి.

మనవాళ్లపై రాళ్ల వర్షం:
అప్పటికే అక్కడ బాగా చీకటి పడింది. గల్వాన్‌ నది ఒడ్డున, పర్వతంపైన మాటు వేసిన చైనా బలగాలు అక్కడికి వచ్చాయి. వస్తూనే భారత సైనికులపై పెద్ద రాళ్లతో దాడి చేశాయి. సంతోష్‌ తలపై ఒక పెద్ద రాయి పడింది. దీంతో ఆయన గల్వాన్‌ నదిలోకి పడిపోయారు. తమ కమాండింగ్‌ అధికారి నేలకొరగడంతో భారత సైనికులు ఊగిపోయారు. చైనా సైనికులు 350 మంది. తాము వంద మంది. అయినా లెక్కచేయక వారిపై విరుచుకుపడ్డారు. ఇరు దేశాలకు చెందిన అనేక మంది చనిపోయారు.

శత్రువు చుట్టుముట్టినా సింహంలా గర్జించాడు:
గల్వాన్‌ లోయలో దాదాపు 3 గంటల పాటు భీకర పోరాటం సాగింది. పోరు ఆగేసరికి భారత్‌, చైనాలకు చెందిన అనేక మంది సైనికుల మృతదేహాలు నదిలో ఉన్నాయి. సంతోష్‌ సహా పలువురు భారత జవాన్ల మృతదేహాలను మన సైన్యం వెనక్కి తీసుకొచ్చింది. మిగతా బృందం మాత్రం ఘటనా స్థలంలో ఉండి పరిస్థితిని సమీక్షించింది. మరుసటి రోజు ఉదయానికి ఉద్రిక్తతలు కొద్దిగా తగ్గాయి. చైనా సైనికుల మృతదేహాలు ఇంకా అక్కడే పడి ఉన్నాయి. వీటిని మన సైనికులు పొరుగు దేశానికి అప్పగించారు. సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ పీపీ14 దగ్గర చైనా శిబిరాన్ని సంతోష్‌ బృందం విజయవంతంగా తొలగించింది.  మన సైనికుల్ని ముందుండి నడిపించిన సంతోష్ లోని నాయకత్వ లక్షణాలు, శౌర్య పరాక్రమాలు తీవ్ర ఉద్వేగానికి గురి చేస్తాయి. రాళ్ల దెబ్బలు తగిలి నిలువెల్లా గాయాలైనా పోరాటస్ఫూర్తిని మరిచిపోని ఆ వీరుడికి ప్రతీ భారతీయుడు పిడికిలి బిగించి సెల్యూట్ చేయాలి.

Read: షెల్టర్ హోమ్‌లో 57మంది మైనర్ అమ్మాయిలకు కరోనా..