Coromandel Express : కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణం వీడియో.. ఈ ట్రైన్ కు ఎందుకంత క్రేజ్!
కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నిత్యం ప్రయాణికులతో అత్యంత రద్దీగా ఉంటుంది. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కావడం, స్టాప్ లు తక్కువగా ఉండడంతో ప్రయాణికులు ఈ రైలును ప్రిఫర్ చేస్తారు.
Coromandel Superfast Express : ఒడిశాలో శుక్రవారం చోటుచేసుకున్న రైలు ప్రమాదం (Train Accident) పెను విషాదాన్ని రేపింది. మూడు రైళ్లు ప్రమాదానికి గురికావడంతో పట్టాలపై మరణ మృదంగం మోగింది. వందల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా, వెయ్యిమందిపైగా క్షతగాత్రులయ్యారు. కోరమండల్ ఎక్స్ప్రెస్ రైలు ముందుగా పట్టాలు తప్పడం (Derailment) పెను ప్రమాదానికి కారణమని రైల్వే శాఖ వెల్లడించింది. పట్టాలు తప్పిన కోరమండల్ ఎక్స్ప్రెస్ బోగిలను బెంగళూరు- హౌరా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (howrah superfast express), గూడ్స్ రైలు (goods train) ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత పెరిగిందని తెలిపింది.
46 ఏళ్ల క్రితం ప్రారంభం
కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నిత్యం ప్రయాణికులతో అత్యంత రద్దీగా ఉంటుంది. ప్రతి రోజు పశ్చిమ బెంగాల్ లోని షాలిమార్ నుంచి తమిళనాడులోని ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ కు 1662 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 25 గంటల 30 నిమిషాల పాటు 4 రాష్ట్రాల గుండా సాగే జర్నీలో 14 రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. 46 ఏళ్ల క్రితం 1997, మార్చి 6న ఈ రైలు సర్వీసు ప్రారంభమైనట్టు రికార్డులు చెబుతున్నాయి. కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ గరిష్ట వేగం 130 కిలోమీటర్లు కాగా, హాల్ట్ ను కలుపుకుని సగటున గంటకు 65 కిలోమీటర్ల వేగంతో వెళుతుందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
Also Read: ఒడిశాలో జరిగిన అతిపెద్ద రైల్వే ప్రమాదంపై తప్పక తెలుసుకోవాల్సిన వివరాలు ఇవే..
స్టాప్ లు తక్కువ.. బోగిలు కిటకిట
సౌత్ ఈస్టర్న్ రైల్వే ఆధ్వర్యంలో నడిచే కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లో ఏసీ ఫస్ట్ క్లాస్, ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, సెకండ్ సిట్టింగ్ బోగిలు ఉంటాయి. చెన్నైకి వెళ్లేవారు ఎక్కువగా ఈ రైలులో ప్రయాణిస్తారు. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కావడం, స్టాప్ లు తక్కువగా ఉండడంతో ప్రయాణికులు ఈ రైలును ప్రిఫర్ చేస్తారు. ప్రతిరోజు ప్రయాణించే కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. జనరల్ టిక్కెట్ ఉన్నవారు కూడా రిజర్వేషన్ల బోగిల్లోకి ఎక్కేస్తుంటారు. ఏసీ బోగిలు మినహాయించి మిగతా అన్ని బోగిలు కిటకిటలాడుతుంటాయి.
This is the video of Coromandel express inside Reserved sleeper coach on 5th may 2023.
Now imagine the situation last night too.
This is complete failure and mismanagement from railways ministry.#TrainAccident
— Dr Nimo Yadav (@niiravmodi) June 3, 2023
కష్టతరంగా మారిన మృతుల గుర్తింపు
ఒడిశాలో కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్రమాదం నేపథ్యంలో ట్విటర్ షేర్ చేసిన పాత వీడియో ఒకటి వైరల్ గా మారింది. మే నెల 5న ప్రయాణికులతో నిండిపోయిన స్వీపర్ బోగిలోని దృశ్యాలు ఈ వీడియోలో
ఉన్నాయి. ప్రస్తుత ప్రమాద నేపథ్యంలో మృతులను గుర్తించడం రైల్వే సిబ్బందికి కష్టతరంగా మారింది. ఎందుకంటే చాలా ప్రయాణికులు జనరల్ టిక్కెట్ తో రిజర్వుడు బోగిలో ప్రయాణించారు. దీంతో ప్రమాదంలో
ప్రాణాలు కోల్పోయిన వారిని, క్షతగాత్రులను గుర్తించడానికి రైల్వే అధికారులు శ్రమించాల్సి వస్తోంది. మరోవైపు ప్రయాణికుల కుటుంబీకులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తమ వారు ప్రాణాలతో ఉన్నారా, లేదా అనే
భయంతో వణికిపోతున్నారు. వీరి కోసం రైల్వేశాఖ సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసింది.
Also Read: రైలు ప్రమాదంపై కొత్త ప్రశ్నలు.. కవచ్ ఉండి కూడా ప్రమాదం జరిగిందా? లేదంటే కవచమే లేదా?