UP Election 2022: ముగిసిన తొలి దశ యూపీ ఎన్నికల పోలింగ్

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. 11 జిల్లాల పరిధిలోని మొత్తం 58 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరిగింది.

UP Election 2022: ముగిసిన తొలి దశ యూపీ ఎన్నికల పోలింగ్

Voting (1)

UP Election 2022: ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. 11 జిల్లాల పరిధిలోని మొత్తం 58 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరిగింది. దాదాపు 62.08 శాతం పోలింగ్‌ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

ఇది 2017లో 63.5శాతం కంటే తక్కువ. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించినప్పటికీ మొత్తంగా తొలిదశ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.

ఈ దశలో మొత్తం 25వేల 880 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు జరగ్గా.. మహిళా ఓటర్ల కోసం ప్రత్యేకంగా 138 పింక్‌ బూత్‌లను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.

షామ్లి, హాపూర్‌, గౌతమ్‌బుద్ధనగర్‌, ముజఫర్‌నగర్‌, మేరఠ్‌, బాగ్‌పత్‌, ఘజియాబాద్‌, బులంద్‌షహర్‌, అలీగఢ్‌, మథుర, ఆగ్రా జిల్లాల్లో గురువారం తొలిదశ పోలింగ్‌ జరిగింది. ఈ జిల్లాలోని 58 అసెంబ్లీ స్థానాలకు 12 స్థానాలను సమస్యాత్మకమైనవిగా అధికారులు గుర్తించారు.

మొదటి విడతలో భాగంగా లక్షమంది పోలీసుల సిబ్బంది, హోంగార్డులు విధుల్లో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. వీరితోపాటు మరో 800 కంపెనీల కేంద్ర బలగాలను విధుల్లో పాల్గొన్నాయని తెలిపారు. ఒక్కో కంపెనీలో 70-80 మంది సిబ్బంది ఉన్నట్లు వివరించారు.

తొలివిడతలో మొత్తం 623 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో అధికార బీజేపీ ప్రభుత్వంలోని ఎనిమిది మంది మంత్రులు ఉండగా.. వారి భవిష్యత్తు ప్రస్తుతం ఈవీఎంలలో నిక్షిప్తమైంది.

తొలిదశలో మొత్తంగా 2.27కోట్ల మంది ఓటర్లు పాల్గొనాల్సి ఉండగా.. వీరిలో 60శాతం మంది మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.