ఫ్లిప్కార్ట్లో మరో 9వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్న వాల్ మార్ట్
భారత ఈ-కామర్స్ రంగంలో దూసుకుపోతున్న అమెజాన్, జియోమార్ట్కు గట్టి పోటీ ఇచ్చేందుకు అమెరికా రిటైల్ దిగ్గజం వాల్మార్ట్…ఫ్లిప్కార్ట్లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ లో పలు దఫాలుగా పెట్టుబడులు పెట్టి, మెజారిటీ వాటాలను దక్కించుకున్న వాల్ మార్ట్…తాజాగా ఫ్లిప్కార్ట్లో మరో 1.2 బిలియన్ డాలర్లు(9,045 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని వెల్లడించిన ఫ్లిప్ కార్ట్, ఈ పెట్టుబడితో సంస్థ విలువ 24.9 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని తెలిపింది
2021 ఆర్థిక సంవత్సరంలో రెండు దఫాలుగా, ఈ పెట్టుబడి సంస్థకు రానుందని ఫ్లిప్ కార్ట్ తెలిపింది. ఈ నిధులతో తమ విస్తరణ, అభివృద్ధి ప్రణాళికలను కొనసాగిస్తామని, కరోనా కష్టాల నేపథ్యంలో ఈ-కామర్స్ మార్కెట్ ప్లేస్ ఇండియాలో నానాటికీ విస్తరిస్తున్న వేళ, మరింత మార్కెట్ వాటాను సాధించేందుకు కృషి చేస్తామని తెలిపింది.
దేశంలోని 20 కోట్ల దుకాణదారులను ఆన్లైన్లోకి తీసుకురావడానికి కంపెనీ ప్రయత్నిస్తోందని ఫ్లిప్కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి తెలిపారు. ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద ఇంటర్నెట్ మార్కెట్గా ఉన్న భారత్…కోవిడ్ సంక్షోభం నుంచి కోలుకునేందుకు చర్యలు ప్రారంభించడంతో దేశంలోని తన ఈ-కామర్స్ మార్కెట్ను మరింతగా పెంచుకోవడానికి తాజా మూలధనం సహాయపడుతుందని ఫ్లిప్కార్ట్ పేర్కొంది.
కాగా, 2018లో 16 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఫ్లిప్ కార్ట్ లో 77 శాతం వాటాలను వాల్ మార్ట్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ప్రముఖ స్టార్టప్ సంస్థగా ఉన్న ఫ్లిప్ కార్ట్, ఆపై ఇండియాలో అమెజాన్ కు గట్టి పోటీ ఇచ్చే స్థాయికి చేరుకుంది. తాజా పెట్టుబడులతో ఫ్లిప్ కార్ట్ లో వాల్ మార్ట్ వాటా 80శాతానికి చేరుకుంది.