సుప్రీం తీర్పును గౌరవిస్తున్నాం : సున్నీ వక్ఫ్ బోర్డు లాయర్
అయోధ్యలో రామజన్మభూమి – బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పును గౌరవిస్తున్నామని సున్నీ వక్ఫ్ బోర్డు లాయర్ జిలానీ పేర్కొన్నారు. సుప్రీం తీర్పు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. సుప్రీం తీర్పును గౌరవిస్తాం. కానీ తాము ఆ తీర్పుతో సంతృప్తి చెందలేదు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.
‘చాలా మంది చరిత్రకారులు, పర్యాటకులు కూడా అయోధ్యను రామజన్మభూమిగా నమ్ముతున్నారు. కానీ, నమ్మకం వ్యక్తిగతమైనది. న్యాయ సూత్రాల ఆధారంగానే భూ హక్కులు కేటాయిస్తాం. ప్రధానమైన డోమ్ కింద రాముడి జన్మస్థానం అని నమ్ముతారని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. వివాదాస్పద స్థలం హిందువులదేనని తీర్పు చెప్పిన సుప్రీం కోర్టు.. ముస్లింలకు అయోధ్యలోనే 5 ఎకరాల స్థలం ఇవ్వాలని తుదితీర్పులో స్పష్టం చేసింది.
అయోధ్య తుదితీర్పును వెల్లడిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద స్థలం హిందువులకు అప్పగించాలని కోర్టు తీర్పు చెప్పింది. ‘2.77 ఎకరాల వివాదాస్పద స్థలం అయోధ్య ట్రస్ట్కు అప్పగించండి. ప్రత్యామ్నాయంగా ఐదెకరాల భూమిని సున్నీ బోర్డుకు ఇవ్వండి. స్థలం స్వాధీనం చేసుకునేందుకు 3 నెలల్లో ట్రస్ట్ ఏర్పాటు చేయాలి. అయోధ్య చట్టం కింద మూడు నెలల్లో మందిర నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేయండి. ఆ భూమిని ట్రస్ట్కి అప్పగించండి. ఆలయ నిర్మాణం, నిర్వహణ పనులను ట్రస్ట్ చేపట్టాలని’ తీర్పులో సుప్రీంకోర్టు వెల్లడించింది.
Zafaryab Jilani, Sunni Waqf Board Lawyer: We respect the judgement but we are not satisfied, we will decide further course of action. #AyodhyaJudgment pic.twitter.com/5TCpC0QXl6
— ANI (@ANI) November 9, 2019