Lambda Variant : లామ్డా వేరియంట్ లేదు..ఆ రెండు రాష్ట్రాల నుంచే అత్యధిక కోవిడ్ కేసులు
గత వారం దేశంలో నమోదైన మొత్తం కోవిడ్ కేసుల్లో సగానికి పైగా(53శాతం) కేసులు మహారాష్ట్ర,కేరళ రాష్ట్రాల నుంచే నమోదయ్యాయని శుక్రవారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
Lambda Variant గత వారం దేశంలో నమోదైన మొత్తం కోవిడ్ కేసుల్లో సగానికి పైగా(53శాతం) కేసులు మహారాష్ట్ర,కేరళ రాష్ట్రాల నుంచే నమోదయ్యాయని శుక్రవారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. మహారాష్ట్ర(21శాతం), కేరళ(32శాతం)కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
జులై 8నాటికి 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 66 జిల్లాల్లో కొవిడ్ పాజిటివిటీ రేటు 10 శాతం కంటే ఎక్కువగా నమోదైందని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ చెప్పారు. 5 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 90 జిల్లాల నుంచి 80 శాతం కరోనా కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో కరోనా కట్టడికి మరింత పటిష్ఠమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఇది తెలియజేస్తోందన్నారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇంకా సమసిపోలేదని, కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. పర్యటక ప్రాంతాల్లో భౌతిక దూరం నిబంధనలు పాటించకుండా, మాస్కు ధరించకుండా ప్రజలు సంచరించడం ఆందోళనకు దారి తీస్తోందన్నారు.
అయితే, దేశవ్యాప్తంగా నమోదయ్యే కొత్త కేసులు తగ్గుముఖం పడుతున్నాయని వీకే పాల్ చెప్పారు. కొత్త కేసుల్లో సగటున 8 శాతం తగ్గుదల నమోదవుతున్నట్లు తెలిపారు. రికవరీల సంఖ్య కూడా పెరుగుతోందన్న ఆయన.. శుక్రవారం రికవరీ రేటు 97.2 శాతంగా ఉన్నట్లు పేర్కొన్నారు. గర్భిణులు టీకా తీసుకునేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు.
ఇక, వివిధ దేశాలను కలవరపెడుతున్న లామ్డా వేరియంట్ను ఇప్పటివరకు భారత్లో గుర్తించలేదని వీకే పాల్ చెప్పారు. లామ్డా వేరియంట్ అనేది వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్.. ఈ వేరియంట్ను జాగ్రత్తగా పరిశీలించాలి.. ఇప్పటివరకైతే భారత్లో ఈ వేరియంట్ వెలుగు చూసిందనడానికి ఆధారాలు లేవు అని వీకే పాల్ అన్నారు. పెరూ దేశంలో 80 శాతం కేసులకు ఈ వేరియంట్ కారణమని,సౌత్ అమెరికా దేశాల్లో కూడా ఈ వేరియంట్ వెలుగుచూసిందని,యూకే,యూరప్ దేశాల్లో కూడా లామ్డా వేరియంట్ వెలుగులోకి వచ్చిందని,ప్రజాఆరోగ్యంపై ప్రభావం చూపే ఏదైనా మానిటర్ చేయబడుతుందని వీకే పాల్ తెలిపారు.