సీబీఐ కేసు : విచారణ నుంచి తప్పుకున్న మరో జడ్జి

  • Published By: venkaiahnaidu ,Published On : January 31, 2019 / 07:04 AM IST
సీబీఐ కేసు : విచారణ నుంచి తప్పుకున్న మరో జడ్జి

మన్నె నాగేశ్వరరావును సీబీఐ తాత్కాలిక డైరక్టర్ గా నియమిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలై ఎన్జీవో సంస్థ కామన్ కాజ్ మరికొందరు సుప్రీకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ నుంచి ఇప్పుడు మరో న్యాయమూర్తి తప్పుకున్నారు. ఇప్పటికే ఈ విచారణ నుంచి చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ సిక్రి తప్పుకోగా గురువారం(జనవరి 31, 2019) జస్టిస్ ఎన్వీ రమణ తాను కూడా పిటిషన్ పై విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు.

 

మన్నె నాగేశ్వరరావు – తాను ఒకే రాష్ట్రానికి చెందిన వ్యక్తులమని, ఆయన కూతురు వివాహ కార్యక్రమానికి కూడా హాజరయ్యానని చెప్పుకొచ్చారు. విచారణలో పారదర్శకత ఉండాలన్న ఉద్దేశ్యంతోనే ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు రమణ వెల్లడించారు. ఈ కేసుని తగిన ధర్మాసనానికి అప్పగించాలని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ ని జస్టిస్ రమణ కోరారు.

ఈ పిటిషన్ మొదట చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ ధర్మాసనం ముందుకు వచ్చింది. సీబీఐ నూతన డైరక్టర్ ను ఎంపిక చేసే హైపవర్ కమిటీలో సభ్యుడిగా ఉన్నందున ఈ పిటిషన్ ను విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఆ తర్వాత జస్టిస్ సిక్రి నేతృత్వంలోని ధర్మాసనానికి అప్పగించారు. సీబీఐ డైరక్టర్ పదవి నుంచి అలోక్ వర్మను తొలగించిన కమిటీలో సభ్యుడిగా ఉండటం వల్ల ఈ విచారణ చేపట్టలేనని ఆయన కూడా తప్పుకున్నారు. ఇప్పుడు జస్టిస్ ఎన్వీ రమణ కూడా ఈ పిటిషన్ పై విచారణ నుంచి తప్పుకున్నారు.