బీజేపీ నాయకుడి కాల్చివేత … తీవ్ర ఉద్రిక్తం
పశ్చిమ బెంగాల్ కు చెందిన బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ ముఖ్య అనుచరుడు, టిటాగర్ మునిసిపాలిటీ కౌన్సిలర్ మనీష్ శుక్లా దారుణ హత్యకు గురయ్యారు. పోలీస్ స్టేషన్ కు సమీపంలోనే దుండగులు అతి దగ్గర నుంచి ఆయనపై కాల్పులు జరిపి పరారయ్యారు. ఈ కాల్పుల్లో మనీష్ అక్కడిక్కకడే కుప్పకూలిపోయారు. ఈ హత్యకు నిరసనగా బీజేపీ మద్దతుదారులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారి తీయటంతో పోలీసులు అదనపు బలగాలను మొహరించారు.
ఉత్తర 24 పరగణాల పరిధలోని టిటాఘర్ ప్రాంతంలో అక్టోబర్ 4, ఆదివారం రాత్రి, పార్టీ నాయకులతో సమావేశం అనంతరం మనీష్ శుక్లా కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో ముసుగులు ధరించిన ఇద్దరు గుర్తు తెలియని దుండగులు మనీష్ శుక్లాపై అతి దగ్గర నుంచి కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడిక్కడే కుప్పకూలిపోయారు.
ఈ కాల్పుల్లో శుక్లాతోపాటు మరో ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన శుక్లాను కోల్కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్లా కన్ను మూశారు. ఈ ఘటననతో కోపోద్రిక్తులైన బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పరిస్థితి అదుపు తప్పడంతో సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారి మనోజ్ వర్మ పరిస్థితిని చక్కదిద్దారు. ఈ ఘటనపై బీజేపీ 12 గంటల బంద్కు పిలుపునిచ్చింది.
తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసీ) ఈ దాడికి పాల్పడిందని ఎంపీ అర్జున్ సింగ్ ఆరోపించారు. రాత్రి 7.30 వరకు తనతో ఉన్నారని, పోలీసుల సమక్షంలోనే శుక్లాపై కాల్పులు జరిగాయని ఆయన విమర్శించారు. మరోవైపు ప్రతిపక్ష బీజేపీ ఆరోపణలను TMC తోసిపుచ్చింది. BJP లో జరుగుతున్న అంతర్గత పోరుకు శుక్లా హత్య నిదర్శనమని ఖండించింది.
తప్పుడు ఆరోపణలతో టీఎంసీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని టీఎంసీ నేత నిర్మల్ ఘోష్ విమర్శలను తిప్పికొట్టారు. కాగా 2019 లో బీజేపీలో చేరిన మనీష్ శుక్లా ఎంపీ అర్జున్ సింగ్ ప్రధాన అనుచరుడుగా వ్యవహరిస్తున్నారు. శుక్లా బీజేపీలో చేరడానికి ముందు TMC లో ఉన్నారు.
మనీష్ తనకు తమ్ముడి లాంటి వాడని, బెంగాల్ ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడంటూ ఎంపీ అర్జున్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి టీఎంసీ, పోలీసులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గియా కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని పోలీసుల పాత్రను దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ ట్విటర్ లో ఒక వీడియో పోస్ట్ చేశారు.
అధికార పార్టీ నేరస్థులకు ఆశ్రయం కల్పిస్తోందని మరో సీనియర్ నాయకుడు అరవింద్ మీనన్ ఆరోపించారు. టీఎంసీ కుట్రలతో బహిరంగ హత్యలకు తెగబడుతోందని ట్వీట్ చేశారు. మరోవైపు గవర్నర్ జగదీప్ ధన్ఖర్ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి, డీజీపీని సోమవారం ఉదయం 10 గంటలకు రాజ్ భవన్కు పిలిచారు.
Bengal is now being turned into place where murders are normalised! Manish Shukla, BJP councillor from Titagarh was shot by TMC goons. These series of murders clearly indicates towards your inevitable end TMC. pic.twitter.com/t3LBqjrtNT
— BJP Bengal (@BJP4Bengal) October 4, 2020