Kolkata : పశ్చిమ బెంగాల్ లో 22 మంది అరెస్ట్!
అమెజాన్ ఉద్యోగులం అంటూ ఫోన్ చేసి డబ్బులు దండుకుంటున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
Kolkata : సైబర్ నేరగాళ్ల ఆగడాలు పెరిగిపోతున్నాయి. అమాయకులను ఆసరాగా చేసుకొని కోట్లు దండుకుంటున్నారు. ఇక కొందరైతే ఏకంగా కాల్ సెంటర్ ఏర్పాటు చేసిమరి డబ్బులు లాగేస్తున్నారు. వివరాల్లోకి వెళితే పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ ముఠా విదేశీయులను టార్గెట్ చేసుకొని డబ్బులు లాగుతోంది. మేము అమెజాన్ నుంచి కాల్ చేస్తున్నాం. మీ గిఫ్ట్మనీ తిరిగి వస్తుంది.. అయితే దీనికోసం మీరు కొంతమొత్తం చెల్లించాల్సి వస్తుందని చెప్పి వసూళ్లకు పాల్పడుతున్నారు. విదేశీయులను టార్గెట్ గా చేసుకొని డబ్బు కాజేస్తున్నారు.
స్పష్టమైన సమాచారంతో కాల్ సెంటర్ పై దాడి చేసిన పోలీసులు 22 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఇక వీరి చేతిలో ఆస్ట్రేలియాకు చెందిన పౌరులు కొందరు మోసపోయినట్లు పోలీసులు నిర్దారించారు. ఇక ఈ అంశంపై పోలీసులు మాట్లాడుతూ.. వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ కమ్యూనికేషన్ సిస్టమ్ను ఉపయోగించి తాము అమెజాన్ ఉద్యోగులమని, మీ గిఫ్ట్ మనీ వాపసు వస్తుందని అమాయకులను నమ్మించి, గిఫ్ట్ పేరుతో కొంత మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నారని తెలిపారు.
వీరి చేతిలో ఆస్ట్రేలియాకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారినుంచి ఆస్ట్రేలియన్ డాలర్లు తీసుకునేవారని చెప్పారు. టార్గెట్ చేసిన కంప్యూటర్లను నియంత్రించడానికి టీమ్వ్యూవర్, ఎనీడెస్క్ వంటి సాఫ్టవేర్లను ఉపయోగించేవారని చెప్పారు. నిందితులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.