కోవిడ్ -19 లాక్డౌన్ పొడిగింపు ఆర్థిక నష్టం అంచనా ఎంతంటే?
ప్రపంచవ్యాప్తంగా కరాళ నత్యం చేస్తున్న కరోనా వైరస్ కట్టడి కోసం ప్రభుత్వం ప్రకటించిన 21 రోజుల లాక్డౌన్ను పోడిగిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ఈ 21రోజుల లాక్ డౌన్కే భారత ఆర్థిక వ్యవస్థ రూ.7నుంచి 8 లక్షల కోట్ల మేర నష్టపోయినట్లు విశ్లేషణ సంస్థలు అంచనా వేశాయి.
మార్చి 25వ తేదీ నుంచి లాక్ డౌన్ అమలులోకి రాగా.. దేశవ్యాప్త లాక్డౌన్ మే 3వ తేదీ వరకు సాగనుంది. అయితే ప్రపంచంలోకెల్లా ఇదే అతిపెద్ద లాక్డౌన్ కాగా.. ఈ రోజుల్లో ఫ్యాకర్టీలు, వ్యాపారాలు మూతపడ్డాయి. బస్సులు, రైళ్లు, విమానాలు ఇలా ప్రజా రవాణా వ్యవస్థలన్నీ స్తంభించిపోయాయి. వ్యక్తులు, వ్యక్తిగత రవాణాపైనా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దీంతో 70 శాతం వరకు ఆర్థిక కార్యకలాపాలు, పెట్టుబడులు, ఎగుమతులు, వినియోగం నిలిచిపోయాయి.
ఇప్పుడు బహిరంగ మార్కెట్లో కేవలం నిత్యావసర సరుకులు, సేవలు, బ్యాంకింగ్, ఐటీ, కీలక ప్రభుత్వ సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో వారానికి వచ్చే ఆర్థిక నష్టం రూ. లక్షా 90వేల కోట్ల వరకు ఉంటుందనేది అంచనా.. మార్చి 24వ తేదీన అంచనా వేసిన ఆర్థిక వ్యయం కంటే ఇది చాలా ఎక్కువ.
ఆర్థిక వ్యవస్థపై మొత్తం దెబ్బ 234.4 బిలియన్ డాలర్లు (జిడిపిలో 8.1%) ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఇది అంతకుముందు వేసిన 120 బిలియన్ డాలర్లు కంటే రెట్టింపు అంచనా. దేశవ్యాప్తంగా ఇంకా కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టలేదు. ఇటువంటి పరిస్థితిలో లాక్ డౌన్ పొడిగించగా.. ఆర్థిక నష్టం భరించక తప్పదు అని అంటున్నారు.