PK STrategy In congress : పాతాళంలోకి పడిపోతున్న కాంగ్రెస్ లో చేరాలనుకుంటున్న PK స్ట్రాటజీ అదేనా?
కాంగ్రెస్ చావదు.. నేను చావనివ్వను..హస్తానికి ఆయువు పోస్తానంటున్నాడు ప్రశాంత్ కిశోర్.పాతాళంలోకి పడిపోతున్న కాంగ్రెస్ లో చేరాలనుకుంటున్న PK స్ట్రాటజీ అదేనా?
PK STRATEGY In congress : కాంగ్రెస్ చావదు.. నేను చావనివ్వను..హస్తానికి ఆయువు పోస్తానంటున్నాడు ప్రశాంత్ కిశోర్. కుంభస్థలాన్ని కొట్టడమే పీకే వ్యూహమా? అంటే నిజమేనంటున్నాడీ రాజకీయాల చాణక్యుడు. స్ట్రాటజిస్ట్కు అంత స్టామినా ఉందా? అంటే ఉందనే చెప్పాలి.
ప్రశాంత్ కిశోర్.. ఇండియన్స్ పాలిటిక్స్లో పరిచయం అక్కర్లేని వ్యూహాకర్త. ఆయన వ్యూహాలు పన్నితే అధికారం ఖాయం. ఆయన స్కెచ్ గీస్తే ప్రత్యర్థి పార్టీలు ఖతం. తిమ్మిని బమ్మిని చేస్తాడు.. జీరోని హీరోగా చూపిస్తాడు. నన్ను నమ్మండి.. పవర్లోకి వచ్చేయండి అంటూ పొలిటికల్ లీడర్లకు భరోసా ఇస్తాడు. బీజేపీ నుంచి రీజినల్ పార్టీల దాకా.. ఎంతోమంది అధికారంలోకి రావడంలో కీలకపాత్ర పోషించాడు పీకే. ఇన్నాళ్లూ తెర వెనుక తతంగానికే పరిమితమైన పీకే.. ఇప్పుడు స్ట్రెయిట్గా తెర ముందుకు దూకుతున్నాడు. ఫుల్ లెంగ్త్ పొలిటికల్ లీడర్ రోల్ ప్లే చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ.. ప్రశాంత్ కిశోర్ యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చేందుకు.. కాంగ్రెస్ పార్టీని సెలెక్ట్ చేసుకోవడమే అందరికీ ఒకింత షాకిచ్చింది. 2014 ఎన్నికల నుంచి వరుస పరాజయాలతో పాతాళంలోకి పడిపోతున్న కాంగ్రెస్ పార్టీనే.. ప్రశాంత్ కిశోర్ ఎందుకు ఎంచుకున్నాడు? హస్తానికి మెల్లగా ఊపిరిపోస్తూ.. తన రాజకీయ భవిష్యత్కు రాచబాటలు వేసుకోవాలన్నదే పీకే స్ట్రాటజీనా? వర్గ విభేదాలకు పెట్టంది పేరైన కాంగ్రెస్ పార్టీలో పీకే పాచికలు పారతాయా? సముద్రం లాంటి గ్రాండ్ ఓల్డ్ పార్టీలో పీకే వ్యూహాలు అమలు చేయడం అంత ఈజీనా?
Also read : Congress party: పీకేకు కాంగ్రెస్లో ఏ పదవి ఇవ్వబోతున్నారు? సీనియర్ల కమిటీ ఇచ్చిన నివేదికలో ఏముంది?
కాంగ్రెస్లో చేరబోతున్న రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. వారం రోజులుగా నేషనల్ పాలిటిక్స్లో హాట్ టాపిక్ ఇదే. సోనియా, రాహుల్, ప్రియాంకతో వరుస సమావేశాలు పెడుతూ హీట్ పెంచుతున్నారు పీకే. తాజాగా మరో అడుగు ముందుకేసి ఆయన హస్తం తీర్థం పుచ్చుకోవాలని డిసైడైనట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీని పూర్తిగా సమాధి చేయడం ఎవరివల్లా కాదు. బూడిదలో నుంచి కూడా ప్రాణం పోసుకునే సత్తా ఆ పార్టీకి ఉంది. దేశమంతా ఒప్పుకునే ఈ సత్యాన్నే పీకే కూడా పదేపదే వల్లె వేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ చావదు.. నేను చావనివ్వనంటూ గాంధీ కుటుంబంలో కొత్త ఉత్సాహం నింపుతున్నాడు. పార్టీ మీది.. స్ట్రాటజీ నాది. అందరం కలిసి మళ్లీ జెండా ఎగరేద్దామంటూ కొత్త ఆశలు రేకెత్తిస్తున్నాడు. అలా అని.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనే హస్తం పార్టీని అధికారంలోకి తీసుకొస్తానంటూ అరచేతిలో వైకుంఠం చూపించట్లేదు ప్రశాంత్ కిశోర్. బీజేపీని కొట్టడం మరో 10, 20ఏళ్లదాకా సాధ్యం కాదని గతంలో తేల్చి చెప్పిన ఆయన.. ఇప్పుడు సోనియా సహా అగ్ర నాయకత్వానికి కూడా ఇదే చెప్తున్నాడు. కానీ, బీజేపీని పడగొట్టే సత్తా కాంగ్రెస్కే ఉందంటున్నాడు. మీ శక్తికి నా వ్యూహాలు మిక్స్ చేసి.. బీజేపీకి దీటుగా నిలబడదామంటున్నాడు. బలంగా ఉన్న రాష్ట్రాల్లో సొంతంగా పోటీ చేద్దాం.. శక్తి తక్కువున్న చోట మిత్ర పక్షాలతో కలిసి పనిచేద్దాం. ఏదేమైనా దేశమంతా మళ్లీ విస్తారిద్దాం అంటున్నాడు. అది ఎలా సాధ్యమో పక్కా లెక్కలతో కాంగ్రెస్ హైకమాండ్కు ప్రజెంటేషన్లతో వివరిస్తున్నాడు పీకే.
Also read : Bulldozrr politics : దేశాన్ని భయపెడుతున్న బుల్డోజర్ రాజకీయాలు..యూపీలో మొదలై హస్తినకు అరాచకాలు
కాంగ్రెస్ అంటేనే కుటుంబ పార్టీ అనే విమర్శలున్నాయి. గాంధీలు కాకుండా మరొకరికి ఛాన్స్ ఇవ్వరని ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తుంటాయి. సోనియా, రాహుల్, ప్రియాంక కాకుండా.. వేరే వారికి అధ్యక్ష పదవి ఇస్తారా అంటూ సవాల్ చేస్తుంటాయి. ఇలాంటి విమర్శలకు తగ్గట్టే నెహ్రూ హయాం నుంచి ఇప్పుడు సోనియా దాకా.. అంతా గాంధీ ఫ్యామిలీ పెత్తనమే. ఈ క్రమంలో కాంగ్రెస్ కోలుకోవాలంటే ఈ ముద్ర పోవాలంటున్నాడు ప్రశాంత్ కిశోర్. దాని కోసం వేర్ల నుంచే మార్పులు రావాలంటున్నాడు. అందుకోసం నాన్ గాంధీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనే కొత్త వ్యూహాన్ని రెడీ చేశాడు. గాంధీ కుటుంబంతో సంబంధం లేని వ్యక్తిని కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవాలని ప్రతిపాదించాడు. అది కూడా 2024 ఎన్నికల ముందే జరగాలని.. నాన్ గాంధీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలోనే సార్వత్రిక ఎన్నికలకు వెళ్లాలని సోనియా, రాహుల్, ప్రియాంకలకు తేల్చి చెప్పాడు. మరి.. తమ కుటుంబం చేతుల్లో ఉన్న అధికారాన్ని బయటి వ్యక్తికి అప్పగించడానికి గాంధీలు ఒప్పుకుంటారా? పీకే వ్యూహాలకు ఓకే చెప్పి డేరింగ్ అండ్ డాషింగ్ డెసిషన్ తీసుకుంటారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
గాంధీ కుటుంబానికి ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన ప్రజెంటేషన్లో కీ పాయింట్స్ ఇవే. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీగా కాంగ్రెస్కు ఓ లెగసీ ఉంది. ఇప్పుడా వారసత్వాన్ని కాపాడుకోవడమే అసలు లక్ష్యమంటున్నాడు పీకే. అంతేకాకుండా దేశ ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని.. ఈ దేశాన్ని పాలించే హక్కు కాంగ్రెస్కే ఉందని ఒప్పించాలి. అంతేకాకుండా దేశవ్యాప్తంగా స్తబ్ధుగా ఉన్న శ్రేణుల్ని యాక్టివేట్ చేయాలని.. దూకుడు పెంచితేనే ప్రజలకు చేరువవుతామని ఉద్బోధ చేస్తున్నాడు. అన్నిటికీ మించి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అవినీతికి అడ్డూ అదుపూ ఉండదన్న ముద్ర బలంగా పడిపోయింది. ఈ ముద్రను చెరిపేస్తేనే పునర్ వైభవం ఖాయమన్నది పీకే నమ్మకం. ఇదే విషయాన్ని గాంధీ కుటుంబానికి క్లియర్ కట్గా చెప్పేశాడు. అగ్ర నాయకత్వమంతా జనంలోకి దూసుకెళ్లాలని.. గడప గడపకీ పార్టీని చేర్చాలని సూచించాడు. మరోవైపు 2024 పార్లమెంటు ఎన్నికల కంటే ముందు కొన్ని కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ముందుగా ఆయా రాష్ట్రాలపై ఫోకస్ చేయాలన్నది పీకే వ్యూహం. టైం బాలేనప్పుడు వసుదేవుడే గాడిద కాళ్లు పట్టుకున్నాడు.. అందుకే కాంగ్రెస్ కూడా ఈగోలకు పోకుండా బలం లేని చోట వేరే పార్టీలతో పొత్తు పెట్టుకోవాలంటున్నాడు. ఇక పార్లమెంటు ఎన్నికల్లో ఉత్తర్ప్రదేశ్, బిహార్, ఒడిశాలో సింగిల్గానే బరిలోకి దిగాలని.. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో పొత్తులతో పోటీ చేయాలని పీకే దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యూహాలకు రాహుల్గాంధీ కూడా అంగీకరించారని కాంగ్రెస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అలాగే 2024 ఎన్నికల్లో 370 లోక్సభ సీట్లు సాధించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ పనిచేయాలని.. అందుకు తగ్గట్టుగా ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నాడు.