బీహార్ ఎగ్జిట్ పోల్స్: జనం నాడి ఎలా ఉందంటే? మరికాసేపట్లో ఫలితాలు!

  • Published By: vamsi ,Published On : November 7, 2020 / 05:11 PM IST
బీహార్ ఎగ్జిట్ పోల్స్: జనం నాడి ఎలా ఉందంటే? మరికాసేపట్లో ఫలితాలు!

Bihar Exit Poll Results: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆఖరిదైన మూడవ విడత పోలింగ్ మరి కొద్దిసేపట్లో ముగుస్తుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మూడో దశ ఓటింగ్ ముగిసిన వెంటనే మొత్తం 243 సీట్లలో ఓటింగ్ పూర్తవుతుంది. బీహార్‌లో మొదటి దశలో 71స్థానాలకు అక్టోబర్ 28న, రెండో దశలో 94సీట్లకు నవంబర్ 3, మూడో దశలో 78 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరుగుతుంది.



బీహార్‌లోని మొత్తం 243 అసెంబ్లీ సీట్లలో 38 షెడ్యూల్డ్ క్లాసులకు, రెండు సీట్లు షెడ్యూల్డ్ ట్రైబ్స్ (ఎస్టీ) కు కేటాయించగా.. బీహార్‌లో మొత్తం 7,29,27,396 మంది ఓటర్లు ఉన్నారు. ఇవాళ సాయంత్రం ఆరు గంటల నుంచి ఓట్లకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ రానున్నాయి. అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్‌పైనే ఉండగా.. ఎగ్జిట్ పోల్స్‌పై ఉన్న నిషేధం సాయంత్రం 6.30 గంటలతో ముగియనుంది. పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రాబోతున్నాయి.



ఎగ్జిట్ పోల్స్‌లో చెప్పినవన్నీ సరిగానే ఉంటాయని చెప్పడానికి వీల్లేదు. పలు సందర్భాల్లో ఎగ్జిట్ పోల్స్‌ అంచనాలు తప్పిన సంధర్భాలు ఉన్నాయి. 2015లో యాక్సిస్ ఏపీఎం మినహా ఎన్నికల విశ్లేషకులంతా మహాఘట్ బంధన్‌ (జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్)ను తక్కువగా అంచనా వేశాయి. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయేకు సునాయాసంగా మెజారిటీ వస్తుందని అంచనా వేశాయి. అయితే అప్పుడు అనూహ్య ఫలితాలు వచ్చాయి. మొత్తం 243 సీట్లలో మహాకూటమి 180 సీట్లు గెలుచుకుంది. ఒక్క యాక్సిస్ ఏపీఎం మాత్రమే మహాకూటమికి 169 నుంచి 183, ఎన్డీయేకు 58 నుంచి 70 సీట్లు వస్తాయని అంచనా వేసింది.



https://10tv.in/new-cooks-on-menu-52-year-run-ends-railways-to-exit-parliament-canteens-kitchens/
2015 ఎన్నికల్లో మహాకూటమికి 178 సీట్లు(ఆర్జేడీ 80, జేడీయూ 71, కాంగ్రెస్ 27) దక్కగా, ఎన్డీఏకు కేవలం 56 సీట్లు దక్కాయి. అందులో బీజేపీ వాటానే 52. సీపీఐ ఎంల్ 3, ఇండిపెండెంట్లకు 4 స్థానాలు దక్కాయి. ఇక ఇప్పుడు 2020 బీహార్ ఎన్నికల విషయానికి వస్తే.. పలు జాతీయ ఛానెళ్ల ఓపీనియన్ పోల్స్ అభిప్రాయంలో ఎన్డీఏ వైపే బీహార్ ప్రజలు చూస్తున్నట్లుగా ఉంది. తేజస్వీ యాదవ్ నాయకత్వంలోని మహా కూటమి 70 నుంచి 90 సీట్లతో సరిపెట్టుకుంటుందని అంచనాలు ఉన్నాయి.



అయితే సోషల్‌మీడియా, యూట్యూమ్ కేంద్రంగా కొన్ని ఛానెళ్లు జనాల్లోకి వెళ్లగా.. వాటి ప్రకారం మాత్రం జనం మార్పు కోరుకుంటున్నట్లుగా అర్థం అవుతుంది. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే మాత్రం మరికొంత సమయం ఆగాల్సిందే.