చెట్టు చాటు నుంచి వాలిని చంపాడు, భార్యను అడవులకు పంపాడు.. అలాంటి రాముడు ఆదర్శ పురుషుడు ఎలా అయ్యాడు?

  • Published By: naveen ,Published On : August 4, 2020 / 02:15 PM IST
చెట్టు చాటు నుంచి వాలిని చంపాడు, భార్యను అడవులకు పంపాడు.. అలాంటి రాముడు ఆదర్శ పురుషుడు ఎలా అయ్యాడు?

వాలిని.. చెట్టు చాటు నుంచి చంపాడు.. ఎవరో చెబితే.. భార్యను అడవులకు పంపాడు.. మరి.. రాముడు ఆరాధ్యనీయుడు ఎలా అయ్యాడు? అసలు.. శ్రీరాముడు ఎందుకు గొప్ప.? ఎందులో గొప్ప.? ఆదర్శ పురుషుడని ఎందుకు అంటున్నారు?

శ్రీరాముడు.. సుగుణాభి రాముడు.. జగదభి రాముడు.. మర్యాదా పురుషోత్తముడు.. ఇలా ఎన్నో పేర్లు. మరెన్నో స్తోత్రాలు. ఆయన పేరే ఒక తారకమంత్రం. ఆయన పేరుని జపిస్తే.. కోటి పుణ్యాల ఫలం వస్తుందని చెబుతుంటారు పెద్దలు. శ్రీరాముడు అంత గొప్పవాడు ఎలా అయ్యాడు? అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతున్న వేళ.. ఒక మనిషి దేవుడిగా ఎలా ఎదిగాడో తెలుసుకోవాల్సిన అవసరముంది.

శ్రీరాముడు మనిషా? దేవుడా?
దైవమే.. మానవ రూపంలో అవతరించాడా?.. మనిషే దేవుడిగా ఎదిగిపోయాడా?.. రామాయణంలో చెప్పింది ఎంతవరకు నిజం? ఇవే ప్రశ్నలు చాలా మందిలో తలెత్తుతుంటాయ్. రామాయణం నిండా వాదాలు, వివాదాలతో పాటు రకరకాల కథలు కనిపిస్తాయ్. అయినా.. రామరాజ్యం రావాలని.. రాముని లాంటి పాలకులు కావాలని.. భారత సమాజమంతా కోరుకుంటుంది. ఎందుకంటే.. శ్రీరాముడు ఆదర్శ పురుషుడు కాబట్టి.

మనిషిగా పుట్టి.. దేవుడిగా ఎలా ఎదిగాడు:
రామజన్మభూమిలో రామమందిరం నిర్మాణమవుతున్న వేళ.. యావత్ హిందుసమాజం కల నెరవేరబోతున్న తరుణంలో.. అయోధ్యలో నవశకం మొదలయ్యే సమయాన.. ఆ శ్రీరాముని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మనిషిగా పుట్టి.. దేవుడిగా ఎలా ఎదిగాడో తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఆయన నుంచి నేర్చుకోవాల్సింది.. చాలానే ఉంది. ఎందుకంటే.. రాముడు పురుషోత్తముడు.

విష్ణువు దశావతారాల్లో ఏడో అవతారమే రామావతారం:
శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో.. ఏడో అవతారమే రామావతారం. రావణుడిని హతమార్చేందుకు.. ఈ భూమిపై అవతరించిన శ్రీమన్నారాయణుడే.. శ్రీరాముడు. సాక్షాత్తూ.. మహావిష్ణువే.. రాముడిగా అవతరించి.. నేరుగా వెళ్లి రావణసంహారం చేయొచ్చు కదా అని కొందరు అనుకుంటారు. అంతకుముందు వచ్చిన అన్ని అవతారాల్లోనూ ఆయన చేసింది అదే. మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన అవతారాలన్నీ నిమిషాల్లో ముగిసినవే. మరి.. రామావతారం మాత్రం.. వాల్మీకి రామాయణం ప్రకారం 11 వేల సంవత్సరాలు ఎలా కొనసాగింది? పురాణాల ప్రకారమైతే.. విష్ణుమూర్తి అవతారాల్లో.. పూర్ణమానవుడిగా అవతరించిన సందర్భం మాత్రం శ్రీరాముడే.

అన్ని విషయాల్లోనూ పురుషోత్తముడే:
మనిషిగా అవతరించిన దేవుడే.. శ్రీరాముడు. ఒక మనిషి.. తన జీవితంలో ఎలా ఉండాలో.. ఎలా నడచుకోవాలో.. ఆచరించి చూపించాడు ఆ శ్రీరామచంద్రుడు. ఆదర్శ పురుషుడు ఎవరనే ప్రశ్న వస్తే.. అఖండ భారతావని మొత్తం చెప్పే సమాధానం ఒక్కటే. ఆయనే.. శ్రీరామచంద్రమూర్తి అని. ఆదర్శ దంపతులంటే.. సీతారాములు. ఆదర్శ పాలకుడంటే.. అయోధ్య రాముడు. ఇలా.. అన్ని విషయాల్లోనూ.. పురుషోత్తమునిగా ఎదిగాడు.

రామయణం మిధ్య కాదు, కల్పితం కాదు:
అసలు రామాయణమే లేదని.. ఇదంతా కేవలం ఒక మిథ్యావాదమని, కల్పిత కావ్యమే తప్ప.. చరిత్ర కాదని చెప్పేవాళ్లు ఎక్కువమందే ఉంటారు. కానీ.. రామాయణ కాలం ఇప్పటికే.. టైమ్‌తో సహా తేలింది. ప్రస్తుతం మనం 28వ మహాయుగంలో ఉన్నామని తేల్చారు పరిశోధకులు. రామాయణం.. మహాయుగంలోని త్రేతాయుగంలో జరిగిందని.. వాల్మీకి రామాయణం సారాంశం. మహాయుగమంటే.. కృత, త్రేత, ద్వాపర, కలి యుగాలు. ఒక మహాయుగం.. 4 లక్షల 32 వేల సంవత్సరాలు. ఒక్కో యుగం.. లక్షా 8 వేల సంవత్సరాలు. ఈ లెక్కన చూస్తే.. రామాయణం 10 లక్షల సంవత్సరాల క్రితం జరిగినట్లు.. రుజువులన్నీ దొరికాయి.

రాముడి జన్మస్థలాన్ని కనుగొని గొప్ప ఆలయాన్ని నిర్మించిన విక్రమాదిత్యుడు:
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో.. రాముడి జన్మస్థలాన్ని విక్రమాదిత్యుడు కనుగొని గొప్ప ఆలయాన్ని నిర్మించాడు. రామాయణంలో చెప్పినట్లుగా.. సరయూ నదితీరం, సాకేతపురి.. అన్నీ ధృవీకరణ జరిగాయి. లంకలో రావణాసురుడి ఆనవాళ్లు కూడా స్పష్టంగా లభించాయి. అన్నింటికీ.. మించి రాముడు లంకకు నిర్మించిన రామసేతు.. ఇప్పటికీ 30 కిలోమీటర్ల మేర మనకు కనిపిస్తూనే ఉంది. ఇవన్నీ మానవ నిర్మితాలని.. ప్రపంచ అతి ప్రాచీన నాగరికతకు గుర్తులని.. అంతర్జాతీయ శాస్త్రవేత్తలు గుర్తించారు.