INDIANS AT DUBAI : భారతీయులు దుబాయ్లో ఇళ్లు ఎందుకు కొంటున్నారు? వ్యాపారవేత్తల చూపంతా యూఏఈపై ఉండటానికి కారణాలేంటీ?
INDIANS AT DUBAI : ఇండియన్స్ అంతా ఎగబడి మరీ దుబాయ్లో ఇళ్లు ఎందుకు కొంటున్నారు? కేవలం.. లగ్జరీ కోసమేనా? వ్యాపార ప్రయోజనాలేమైనా ఉన్నాయా? యూఏఈ ప్రభుత్వం తెచ్చిన గోల్డెన్ వీసా ప్రోగ్రామ్ కూడా సంపన్నులను అట్రాక్ట్ చేస్తోందా? దుబాయ్ రియల్ ఎస్టేట్లో ఈ రేంజ్ బూమ్ రావడానికి రీజన్స్ ఏంటి?
ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, అనేక ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉండటంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా ఎక్కువగా ఉండటంతో.. దుబాయ్లో భారత సంతతి పెరుగుతోంది. ముఖ్యంగా.. లగ్జరీ లైఫ్ గడపాలని భావించే సంపన్నులు.. దుబాయ్కి రీలొకేట్ అవడానికి ఇవన్నీ దోహదపడుతున్నాయని.. ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. దుబాయ్లో సెటిల్ అవడం వల్ల.. తమ బిజినెస్లు మరింత పెరుగుతాయని.. ఇతర దేశాలకు కూడా విస్తరించే అవకాశం ఉంటుందని.. అనేకమంది వ్యాపారవేత్తలు భావిస్తున్నారు. దుబాయ్ నుంచి ఇతర దేశాలకు బిజినెస్ టూర్స్ చేయడం కూడా ఈజీ అవుతుందనే ఆలోచనతో ఉన్నారు. దీంతో.. అనేకమంది యంగ్ ఇండియన్ బిజినెస్మ్యాన్స్ దుబాయ్కి అట్రాక్ట్ అవుతున్నారు. అక్కడే ఉండటం వల్ల.. ప్రపంచ మార్కెట్లో లావాదేవీలు జరిపేందుకు అత్యంత వెసులుబాటు కలుగుతుందని భావిస్తున్నారు.
సంపన్న వర్గాలను దుబాయ్కి ఆకర్షించేందుకు.. యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా ప్రోగ్రామ్ను మరింత విస్తరించింది. స్కిల్డ్ ప్రొఫెషనల్స్, సైంటిస్టులు, రీసెర్చ్ స్కాలర్స్తో పాటు ప్రతిభావంతులైన కార్మికులు, ఉద్యోగులను సాదరంగా ఆహ్వానిస్తోంది. ఇది కూడా దుబాయ్ రియాల్టీ రంగ వృద్ధికి కారణంగా చెబుతున్నారు. ప్రతిభావంతులైన విదేశీయులు ఉద్యోగ, విద్యావకాశాలతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో నివాసం ఉండేందుకు దీర్ఘకాలిక గోల్డెన్ వీసా ప్రోగ్రామ్ అనుమతిస్తోంది. ఈ వీసా తీసుకున్న విదేశీయులు.. అక్కడే ఉండి పని చేసుకునేందుకు, చదువుకునేందుకు దీర్ఘకాలం పాటు నివాసం ఉండొచ్చు. ఇది కూడా అక్కడి ఇళ్లపై పెట్టుబడి పెట్టొచ్చనే నమ్మకం మనవాళ్లలో కలిగేలా చేసింది. దుబాయ్లో ఇళ్ల కొనుగోలుకు అంతర్జాతీయంగా డిమాండ్ పెరగడంతో.. అక్కడి రియల్ ఎస్టేట్ కంపెనీలు సిటీలో మరిన్ని అపార్ట్మెంట్లు, విల్లా ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నాయ్.
2015-16 మధ్య దుబాయ్ రియాల్టీ రంగం ఓ వెలుగు వెలిగింది. అయితే.. కోవిడ్ టైమ్లో అక్కడి రెంటల్ మార్కెట్ 30 శాతం పడిపోయింది. అది.. ఈ మధ్యకాలంలోనే కోలుకొని.. ఏడేళ్ల కిందటి స్థాయికి చేరింది. మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేస్తూ.. ప్రపంచవ్యాప్తంగా పర్యటించాల్సి వచ్చే సీనియర్ ఎగ్జిక్యూటివ్లంతా.. ట్రావెలింగ్ పరంగా సౌకర్యంగా ఉంటుందని.. దుబాయ్ని ఎంచుకుంటున్నారు. వృత్తి రీత్యా.. ఇతర దేశాలకు తిరగాల్సి వచ్చినప్పుడు.. చాలా మంది వ్యాపార, పారిశ్రామికవేత్తలకు దుబాయ్ ఎంతో అనువుగా ఉంటోంది. చాలా మంది ఇండియన్ బిజినెస్మ్యాన్స్.. యూఏఈ వైపు మొగ్గు చూపేందుకు.. అక్కడున్న ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ కూడా ఓ ప్రధాన కారణం. అక్కడే నివాసం ఉండటం వల్ల.. విదేశీ సంస్థలతో సంప్రదింపులు జరపడం కూడా సులువని భావిస్తున్నారు.
ఇక.. దుబాయ్లోని ఇండియన్ కరికులమ్ అత్యుత్తమైనదిగా కనిపిస్తోంది. విద్యా వసతుల కల్పనలో.. బెస్ట్ సిటీగా నిలిచింది. పైగా.. దుబాయ్ సిటీకి సురక్షితమైన నగరంగా పేరుంది. క్యాబ్లో డబ్బుల సంచి మర్చిపోయినా.. ఆ డ్రైవర్ అడ్రస్ కనుక్కొని మరీ.. డబ్బుల్ని వెనక్కి తెచ్చి ఇస్తారని.. ఇప్పటికే అక్కడ స్థిరపడిన భారతీయులు చెబుతున్నారు. ముఖ్యంగా.. హైదరాబాద్, అమెరికా, లండన్, కెనడా లాంటి ప్రాంతాలకు తరచుగా ప్రయాణించేవారికి.. దుబాయ్ ఎంతో వెసులుబాటుగా ఉంటుంది. భారత్ నుంచి పాశ్చాత్య దేశాలకు వెళ్లే వాళ్లు కూడా దుబాయ్ మీదుగా వెళ్లాల్సిందే. దీనికితోడు.. దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ ఆధ్వర్యంలో.. ఫిన్ టెక్ ఎకో సిస్టమ్ అందుబాటులోకి రావడం.. భారత పారిశ్రామిక వేత్తలను విశేషంగా ఆకర్షిస్తోంది. అందువల్ల.. మనదేశంలోని సెలబ్రిటీలు, సంపన్నులకు.. దుబాయ్ స్వర్గధామంలా మారింది.