ముస్లింలు ఎందుకు లేరు…CAAపై బీజేపీ ఉపాధ్యక్షుడు అభ్యంతరం
పౌరసత్వ సవరణ చట్టం(CAA)కి వ్యతిరేకంగా విపక్షాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న వేళ మొదటిసారిగా బీజేపీ నుంచి వ్యతిరేక గళం వినిపించింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనవడు, వెస్ట్ బెంగాల్ భాజపా ఉపాధ్యక్షుడు చంద్రకుమార్ బోస్ సీఏఏ పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఒకవేళ సీఏఏ ఏ మతానికి సంబంధించింది కాకపోతే హిందూ, సిక్కు, బౌద్ద, క్రైస్తవ, పార్శీలు, జైనులు అని ఎందుకు పేర్కొన్నారు. ముస్లింలను ఎందుకు చేర్చలేదు? మనం పారదర్శకంగా ఉందాం..!. భారత్ను ఇతర దేశాలతో పోల్చొద్దు. అన్ని వర్గాలు, మతాలను ఈ దేశం స్వాగతిస్తుంది. ఒకవేళ మాతృదేశంలో హింసించకపోతే ముస్లింలు ఇక్కడకు వచ్చేవారే కాదు. కనుక వారిని కలుపుకోవడంలో ఎలాంటి ముప్పు లేదు. పాకిస్థాన్, అఫ్గానిస్థాన్లోని బలోచ్ ప్రజలు, పాకిస్థాన్లోని అహ్మదీయుల పరిస్థితి ఏంటి అని బోస్ ట్వీట్ చేశారు. సీఏఏకు మద్దతుగా బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోల్కతాలో భారీ ర్యాలీ నిర్వహించిన కొద్ది గంటల్లోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.