చలికాలంలో కరోనా కేసులు భారీగా పెరిగే అవకాశముంది : కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి
Covid-19 cases increase during winter దేశంలోనే కరోనా కేసుల సంఖ్య నిత్యం పెరుగుతూనే ఉంది. ప్రతిరోజూ 80వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 70 లక్షలు దాటింది. ఈ క్రమంలో చలికాలం కూడా వచ్చేస్తోంది. అయితే చలికాలం నేపథ్యంలో కరోనా ప్రభావం ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని, కనుక ముందు ముందు మరింత అప్రమత్తంగా ఉండాలని సైంటిస్టులు సూచిస్తున్నారు.
శీతాకాలంలో సహజంగానే ఉష్ణోగ్రతలు తగ్గుతాయిన, 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉందంటే అది కరోనా వంటి వైరస్లకు ఎంతో అనుకూలమైన టెంపరేచర్ అని సైంటిస్టులు అంటున్నారు. చలికాలంలో సూర్య రశ్మి నుంచి అతినీలలోహిత (అల్ట్రా వయొలెట్) కిరణాల ప్రభావం కూడా తక్కువగానే ఉంటుందని, కనుక కరోనా విషయంలో నిర్లక్ష్యం వహించరాదని, ఇప్పటి కన్నా మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సైంటిస్టులు అంటున్నారు.
శీతాకాలంలో కరోనా కేసులు పెరిగే అవకాశముందని పలు రిపోర్ట్ లు చెబుతున్న నేపథ్యంలో ఇవాళ(అక్టోబర్-11,2020)కేంద్రఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ దీనిపై స్పందించారు. ఈ రిపోర్ట్ లను కొట్టిపారేయలేమని హర్షవర్థన్ అన్నారు. భారత్ లో కరోనా కేసుల సంఖ్య చలికాలంలో పెరిగే అవకాశమున్నట్లు ఆయన అభిప్రయాపడ్డారు.
సాధారణంగా శీతాకాలంలో ఎక్కువగా ఇన్ఫ్లూయెంజా, రైనో వైరస్, రెస్పిరేటరీ సిన్సైటియల్ వైరస్ తదితర వైరస్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతుంటాయి. కరోనా కూడా శ్వాసకోస సంబంధిత వైరస్(respiratory virus) మరియు చలివాతారణంలో ఈ వైరస్ లు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. అంతేకాకుండా శీతాకాలంలో నివాసిత గృహాల్లో ఓవర్ క్రౌడింగ్ ఉంటుందనే నిజాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దీనివల్ల వైరస్ వ్యాప్తి పెరిగేఅవకాశముంది. అందువల్ల భారత్ కు సంబంధించి చలికాంలో కరోనా కేసులు పెరుగుతాయి అనే అంచనాలను కొట్టిపారేయలేం అని ప్రతివారం తాను సోషల్ మీడియా ద్వారా ప్రజలతో మాట్లాడే ప్రోగ్రాం సండే సంవాద్ ద్వారా హర్షవర్థన్ తెలిపారు.
యూరప్ దేశాల్లో..ముఖ్యంగా బ్రిటన్ లో చలికాలం ప్రవేశించే కొద్దిరోజుల ముందు కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిన విషయాన్ని ఈ సందర్భంగా హర్షవర్థన్ గుర్తుచేశారు. అయితే,మనం ముందుజాగ్రత్తలు తీసుకొని ముందుకుసాగాలని,ఎటువంటి భయాందోళనలు..ప్రభుత్వం అన్ని ముందుజాగ్రత చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ప్రతిఒక్కరూ మాస్క్ లు ధరించడం,సోషల్ డిస్టెన్స్ ను తప్పనిసరిగా పాటించాలని కోరారు.
మరోవైపు,ఈ చలికాలంలో దేశరాజధాని ఢిల్లీలో రోజుకు 15 వేల కొత్త కరోనా కేసులు నమోదయ్యే అవకాశముందని నేషనల్ సెంటర్ ఫర్ డిసీస్ కంట్రోల్(NCDC)ఓ రిపోర్ట్ లో హెచ్చరించింది.