బెంగాల్ అసెంబ్లీలో TMC V/S మాజీ TMC..ప్రతిపక్ష నేతగా ఎన్నికైన సువెందు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ ఎల్పీ నేతగా సువేందు అధికారిని ఎన్నికయ్యారు.
Suvendu Adhikari పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ ఎల్పీ నేతగా సువేందు అధికారిని ఎన్నికయ్యారు. ప్రతిపక్ష నాయకుడిని ఎంపిక చేసేందుకు బీజేపీ అధిష్టానం కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, పార్టీ జాతీయ జనరల్ సెక్రటరీ భూపేందర్ యాదవ్ను నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం అనంతరం.. అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేతగా సువేందు పేరును కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటించారు. దీంతో ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో 77 స్థానాలను గెలుచుకొని ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన బీజేపీకి అసెంబ్లీలో సువేందు అధికారి సారథ్యం వహించనున్నారు.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందే బీజేపీలో చేరిన సువేందు అధికారి నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై 1956 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ క్రమంలో పార్టీలో సీనియర్ నేతలు ఉన్నప్పటికీ దీదీపై విజయం సాధించిన సువేందు వైపే పార్టీ అధిష్ఠానం మొగ్గు చూపింది.
రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు తాను శక్తివంచన లేకుండా పని చేస్తానని ఈ సందర్భంగా సువేందు అధికారి అన్నారు. ప్రజా ఉపయోగమైన నిర్ణయాల్లో ప్రభుత్వానికి తాము సహకరిస్తామని అన్నారు. అదే సమయంలో రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల అనంతరం కొనసాగుతున్న హింసపై మా గోంతు వినిపిస్తాం అని సువేందు అన్నారు. రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు తనను ఎంతో ఆవేదనకు గురి చేశాని ఈ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు.