వాట్సాప్ కి వార్నింగ్ : కొత్త ప్రైవసీ పాలసీని ఉపసంహరించుకోవాలన్న కేంద్రం
వాట్సాప్కు భారత ప్రభుత్వం గట్టి వార్నింగ్ ఇచ్చింది. జనవరి 4న సంస్థ తీసుకొచ్చిన నూతన ప్రైవసీ పాలసీని వెంటనే ఉపసంహరించుకోవాలని స్పష్టం చేసింది. మా కొత్త పాలసీని అంగీకరించండి..నిబంధనలకు అంగీకరించకపోతే వాట్సాప్ ని వదులుకోండి అన్న వాట్సాప్ సందేశాన్ని ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది.
భారతీయ వినియోగదారుల సమాచార గోప్యత, డేటా భద్రతను గౌరవించాలని..కొత్తగా తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీ నిబంధనలను ఉపసంహరించుకోవాలని వాట్సాప్ సీఈవో విల్ కాత్కార్ట్కు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. మా కొత్త పాలసీని అంగీకరించండి..నిబంధనలకు అంగీకరించకపోతే వాట్సాప్ ని వదులుకోండి అన్న వాట్సాప్ సందేశాన్ని ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది. ఈ సందర్భంగా జస్టిస్ కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా(2017) కేసును ప్రస్తావించింది. ప్రజల ప్రైవసీ, అంగీకార సూత్రాలకు విలువ ఇవ్వాలనే సుప్రీంకోర్టు తీర్పును వాట్సాప్ దృష్టిలో ఉంచుకోవాలని స్పష్టం చేసింది.
వాట్సాప్, ఫేస్బుక్లకు ఇండియాలో 40 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. ఇప్పుడు రెండింటి యూజర్ల డేటాను సేకరిస్తే అది దేశంలోని చాలా మంది పౌరుల ప్రైవసీకి భంగం కలిగించినట్లే అవుతుందని ఆ లేఖలో ఐటీ శాఖ అభిప్రాయపడింది. డేటా షేరింగ్ ప్రోటోకాల్స్, వ్యాపార పద్ధతుల గురించి మరిన్ని వివరాలను కోరుతూ ప్రభుత్వం వాట్సాప్కు ప్రశ్నపత్రాన్ని పంపింది. ఇది భారతీయ వినియోగదారుల నుండి అప్లికేషన్ సేకరించే డేటా యొక్క ఖచ్చితమైన సమాచారాన్ని కోరింది.