అధికారుల ఆదేశాలతో..5నెలల చిన్నారితో విధుల్లోకి మహిళా కండక్టర్
up ఉత్తర్ప్రదేశ్లో ఓ మహిళా బస్ కండక్టర్ తన ఐదు నెలల పసికందును చంకనెత్తుకుని విధులు నిర్వర్తిస్తున్నారు. గోరఖ్పుర్ నుంచి పద్రౌనా మధ్యలో నడిచే బస్సులో పసికందును చంకనెత్తుకుని టికెట్లు ఇస్తోంది. మహిళా బస్ కండక్టర్ పాట్లు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.
యూపీకి చెందిన శిప్రా దీక్షిత్ డిసీస్డ్ డిపెండెంట్ కోటాలో ఉద్యోగం పొంది 2016 నుంచి టికెట్ కండక్టర్గా పనిచేస్తోంది. అయితే 2020 జులై 25 నుంచి ఆరు నెలలపాటు ఆమె ప్రసూతి సెలవుల్లో ఉన్నారు. 2020, ఆగస్టు 21న ఓ పాపకు శిప్రా దీక్షిత్ జన్మనిచ్చింది. ఆరు నెలల సెలవులు ముగియడంతో శిప్రా దీక్షిత్ జనవరి-19,2021న తిరిగి విధుల్లో చేరింది. పసిపాప ఆలనా పాలనా చూసుకోనే వీలు ఉండేందుకు కండక్టర్గా కాకుండా కార్యాలయానికి బదిలీ చేయాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేసినా అధికారులు తిరస్కరించారు. విధులకు హాజరు కావాల్సిందేనని ఆదేశించారు. దీంతో ఉద్యోగం పోతుందనే భయంతో ఐదు నెలల పసికందుతోనే శిప్రా దీక్షిత్ విధులు నిర్వర్తిస్తోంది.
ఎమ్మెస్సీ కెమిస్ట్రీ టాపర్గా నిలిచిన తనపట్ల అధికారులు వివక్షను చూపిస్తున్నారని శిప్రా దీక్షిత్ చెబుతోంది. అన్ని అర్హతలున్నా పదోన్నతి రాలేదని వాపోతుంది. తనకన్నా తక్కువ అనుభవం ఉన్నవారికి కార్యాలయ పనులు అప్పగించారని శిప్రా తెలిపింది.
ఇక, ఈ విషయమై స్పందించిన అసిస్టెంట్ రీజనల్ మేనేజర్ కేకే తివారీ.. కండక్టర్ ఉద్యోగ స్వభావమే అలాంటిదన్నారు. శిప్రాకు ప్రసూతి సెలవులు ఇచ్చామని, పిల్లల సంరక్షణ సెలవులు రవాణా శాఖలో లేనందున ఎలాంటి సహాయం చేయలేమని అన్నారు. ఆమెకు కార్యాలయ పనులు అప్పగించాలంటే ఉన్నతాధికారుల అనుమతి అవసరమని తెలిపారు. అయితే, మిషన్ శక్తి వంటి పథకాలతో మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్నామని ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా..ఆ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖలో ఇప్పటికీ పిల్లల సంరక్షణ సెలవులు లేకపోవడం గమనార్హం.