టీవీ యాడ్స్ లో ఛాన్స్ ఇస్తామని చెప్పి మహిళపై అత్యాచారం

  • Published By: murthy ,Published On : October 1, 2020 / 11:24 AM IST
టీవీ యాడ్స్ లో ఛాన్స్ ఇస్తామని చెప్పి మహిళపై అత్యాచారం

టీవీలో ప్రకటనలలో నటించటానికి కొత్త వ్యక్తులను పరిచయం చేస్తామని చెప్పి ఇద్దరు వ్యక్తులు ఒక మహిళపై అత్యాచారం చేసారు. టీవీల్లో కనపడాలనే తపనతో మహిళలు ఇలాంటి మోసగాళ్ల చేతిలో మోస పోతూనే ఉన్నారు.

పంజాబ్ లోని మొహలీ కు చెందిన ఒక మహిళకు సినిమాల్లోనూ, టీవీల్లోనూ నటించాలనే ఆసక్తి ఉంది. సబ్బుల ప్రకటనలో నటించటానికి కొత్త వాళ్లు కావాలని ఆమెకు తెలిసిన స్నేహితుడి ద్వారా ఆ మహిళ తెలుసుకుంది.



అందుకోసం ముంబై నుంచి ఇద్దరు వ్యక్తులు వచ్చారని వారిని కలుద్దామని స్నేహతుడు చెప్పాడు. వారికి రియాలిటీ షోలు తీసిన  అనుభవం ఉందని స్నేహితుడు చెప్పగా ఆ మహిళ సెప్టెంబర్ 25న తన స్నేహితుడితో కలిసి జిరాక్ పూర్ లోని, లోహాఘర్ రోడ్డులోని ఒక హోటల్ కు వెళ్లింది.

ఆమె ఫోటోలు వీడియోలు చూసిన తర్వాత వారు ఆమె ఎంపికైనట్లు చెప్పారు. మేకప్ టెస్ట్ లు చేయాలని కాసేపు వెయిట్ చేయమని చెప్పి కూల్ డ్రింక్ ఆఫర్ చేశారు. కూల్ డ్రింక్ తాగిన తర్వాత ఆమె స్నేహితుడు వెళ్లి పోయాడు. కానీ కూల్ డ్రింక్ తాగిన కొద్ది సేపటికి ఆ మహిళకు మైకం కమ్మింది. స్పహ కోల్పోయింది.



ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత తన పరిస్ధితిని అంచనా వేసుకుంది. తన దుస్తులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. తనకేదో జరిగినట్లు తెలుసుకుంది. షాక్ కు గురైంది. హోటల్ గదిలో ఉన్న ఇద్దరూ ఆమె పై అత్యాచారం చేసినట్లు ఆమె తెలుసుకుంది.



సమీపంలోని పోలీసు స్టేషన్ కు వెళ్లి వారిద్దరిపై  ఆమె ఫిర్యాదు చేసింది. అత్యాచారం చేసిన వారు నాసిక్ కు చెందిన దినేష్, సునీల్ రామ్ గా గుర్తించారు. వారిపై ఐపీసీ సెక్షన్ 376 జి కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.