Yellow Fungus : ఎల్లో ఫంగస్…ఉత్తరప్రదేశ్ లో తొలి కేసు నమోదు
దేశంలో బ్లాక్, వైట్ ఫంగస్లు క్రమంగా విస్తరిస్తున్న వేళ ఉత్తర్ప్రదేశ్లోని ఘాజియాబాద్ లో తొలిసారిగా "ఎల్లో ఫంగస్" కేసు నమోదైంది.
Yellow fungus దేశంలో బ్లాక్, వైట్ ఫంగస్లు క్రమంగా విస్తరిస్తున్న వేళ ఉత్తర్ప్రదేశ్లోని ఘాజియాబాద్ లో తొలిసారిగా “ఎల్లో ఫంగస్” కేసు నమోదైంది. దేశంలో ఇదే మొదటి ఎల్లో ఫంగస్ కేసు. సంజయ్ నగర్కు చెందిన 45ఏళ్ల వ్యక్తి శరీరంలో ఎల్లో ఫంగస్ ను గుర్తించినట్లు హర్ష ఈఎన్టీ హర్ష ఈఎన్టీ హాస్పిటల్ డాక్టర్ బీపీ త్యాగి తెలిపారు. బ్లాక్, వైట్ ఫంగస్ల కన్నా ఎల్లో ఫంగస్ ప్రమాదకరమని త్యాగి తెలిపారు. ఎల్లో ఫంగస్ సమస్య శరీరం లోపల ప్రారంభం అవుతుందని, లక్షణాలను గుర్తించిన వెంటనే ట్రీట్మెంట్ చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఎల్లో ఫంగస్ ప్రధానంగా వ్యక్తిగత శుభ్రత, పరిసరాల పరిశుభ్రతను పాటించకపోవడం వల్ల వస్తుందని డాక్టర్లు భావిస్తున్నారు. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, ఫంగస్ చేరే అవకాశం ఉన్న, నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు పడేయడం ఉత్తమమని చెబుతున్నారు.
ఎల్లో ఫంగస్ లక్షణాలు
ఎల్లో ఫంగస్ సోకిన వ్యక్తికి విపరీతమైన నీరసం, ఆకలి బాగా తగ్గిపోవడం లేదా అసలు ఆకలి లేకపోవడం, క్రమంగా బరువు తగ్గిపోవడం వంటి లక్షణాలు ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. తీవ్రత ఎక్కువగా ఉన్న కేసుల్లో గాయాలు త్వరగా తగ్గకపోవడం, వాటి నుంచి చీము కారడం, శరీరంలోని కీలక అవయవాలు విఫలం కావడం, కళ్లు పీక్కుపోవడం వంటి లక్షణాలు ఉంటాయని తెలిపారు. ఎల్లో ఫంగస్ ట్రీట్మెంట్ ప్రస్తుతం ఆంఫోటెరిసిన్-బీ ఇంజక్షన్ ఒక్కటే ఉందని తెలిపారు.
ఇక, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో 5,424 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ తెలిపారు. కోవిడ్పై మంత్రుల గ్రూపుతో సోమవారం జరిపిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..బ్లాంగ్ ఫంగస్ కేసుల్లో మెజారిటీ కేసులు కోవిడ్ బారిన పడిన వారేనని, వారిలో సగమందికి డయాబెటిస్ కూడా ఉందని చెప్పారు.