మళ్లీ మోడీయే ప్రధాని..కాక రేపుతున్న ములాయం కామెంట్స్

  • Published By: venkaiahnaidu ,Published On : February 13, 2019 / 03:22 PM IST
మళ్లీ మోడీయే ప్రధాని..కాక రేపుతున్న ములాయం కామెంట్స్

ప్రధాని మోడీపై ప్రశంసల జల్లు కురిపించి విపక్షాలకు షాక్ ఇచ్చారు సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్. బుధవారం(ఫిబ్రవరి-13,2019) పార్లమెంట్ వేదికగా మోడీని పొగడ్తలతో ముంచెత్తారు ములాయం. మోడీ పాలన బాగుందన్నారు.దేశ ప్రజలు మరోసారి మోడీనే ప్రధానిగా కోరుకుంటున్నారని అన్నారు. మోడీ అందరినీ కలుపుకొని ముందుకుసాగుతున్నారని అభినందించారు.

ఈ సమయంలో సభలో ఉన్న ప్రధాని చిరునవ్వులు చిందించారు.అయితే ములాయం పక్కనే కూర్చొన్న సోనియాగాంధీ  సర్ ప్రైజ్ అయ్యారు.ఆ తర్వాత ములాయం స్పీచ్ పై స్పందించిన మోడీ మాట్లాడుతూ..ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు. ములాయం తన ఆశీర్వాదం ఇచ్చారని,  ఆయనపట్ల కృతజ్ణత కలిగి ఉన్నట్లు తెలిపారు.అయితే మోడీపై ములాయం పొగడ్తలు వ్యంగ్యంగా చేసినవే అని ములాయం మద్దతుదారులు అంటున్నప్పటికీ ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమయ్యాయి.

ఓ వైపు మోడీని గద్దె దించాలని ఎస్పీ-బీఎస్పీలు యూపీలో కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా మోడీ విధానాలను కొన్నిరోజులుగా ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తీవ్రంగా విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కోల్ కతాలో నిర్వహించిన విపక్షాల ఐక్యతా ర్యాలీలో కూడా మోడీ సర్కార్ పై అఖిలేష్ విరుచుకుపడ్డారు. 

ములాయం వ్యాఖ్యలపై స్పందించిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ..ములాయం వ్యాఖ్యలను తాను విభేధిస్తున్నానని తెలిపారు. రాజకీయాల్లో ములాయం సింగ్ యాదవ్ పాత్ర ఉందని, ఆయన అభిప్రాయాన్ని తాను గౌరవిస్తానని తెలిపారు.