Seema Patil : ఈమె జీతం రూ.100 కోట్లు
దేశంలోనే అతిపెద్ద రిటైల్ బ్రోకరేజ్ సంస్థ జీరోధాకి సీమా పాటిల్ డైరెక్టర్ గా ఉన్నారు. ఆమె వార్షిక జీతం దాదాపు రూ.100 కోట్లు. అరకోటి
Seema Patil : ‘ఐదంకెల జీతమట..’ అని ఒకప్పుడు గొప్పగా చెప్పుకొనేవాళ్లం. అది పాత మాట. కోట్లలో జీతాలు అందుకోవడం ఇప్పుడు నయాట్రెండ్. కొమ్ములు తిరిగిన సీఈవోలతో పోటీ పడుతూ స్టార్టప్ల చరిత్రలోనే తొలిసారిగా వందకోట్ల జీతాన్ని అందుకుంటున్న మహిళగా వార్తల్లోకెక్కింది జీరోధా(Zerodha) డైరెక్టర్ సీమా పాటిల్(Seema Patil).
దేశంలోనే అతిపెద్ద రిటైల్ బ్రోకరేజ్ సంస్థ జీరోధాకి సీమా పాటిల్ డైరెక్టర్ గా ఉన్నారు. ఆమె వార్షిక జీతం దాదాపు రూ.100 కోట్లు. అరకోటి వినియోగదారులున్న ఈ సంస్థను ఆమె భర్త నితిన్ 2010లో ప్రారంభించారు. మునుపెన్నడూ లేనంతగా యువతని ట్రేడిండ్ వైపు ఆకర్షించింది ఈ సంస్థ. కంపెనీ అభివృద్ధిలో సీమా తొలి నుంచి కీలక పాత్ర పోషిస్తూ డైరెక్టర్ గా ఇంత పారితోషికాన్ని అందుకుంటున్నారు.
ఒకప్పుడు ట్రేడింగ్ అంటే అదో రాకెట్ సైన్స్ అనుకునేవారు. జీరోధా పుణ్యమాని ఆ భావన మారింది. ఇప్పుడు అందరూ ట్రేడింగ్లో సులభంగానే అడుగుపెడుతున్నారు. మునుపెన్నడూ లేనంతగా యువతని ఈ రంగంలోకి ఆహ్వానించిందీ సంస్థ. ట్రేడింగ్ ఛార్జీల్లో ఆకర్షణీయమైన డిస్కౌంట్లని అందివ్వడంతోపాటు… సాంకేతిక సాయంతో సులభంగా, తేలిగ్గా వాడుకోగలగడం జీరోధా యాప్ ప్రత్యేకత. ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్లో ఆరేళ్లు పని చేసిన అనుభవం జీరోధాని ముందుకు నడిపించడంలో సీమా పాటిల్ కు ఉపయోగపడింది.
‘మాది బెళగావ్. మధ్యతరగతి కుటుంబం. నితిన్ ఓ కాల్సెంటర్లో పనిచేస్తూ… జీరోధా ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. నేను కూడా అక్కడే పనిచేసేదాన్ని. ఇంట్లో మా పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు అమ్మానాన్నలు తను పనిచేసే రిలయన్స్ ఆఫీసుకెళ్లి వాకబు చేసి వచ్చారు. తను షేర్లు, స్టాక్స్లో పెట్టుబడులు పెడతాడని తెలిసింది. పైగా కొత్తగా వ్యాపారం పెడుతున్నాడని తెలియగానే మా పెళ్లికి ససేమిరా అన్నారు. స్థిర ఆదాయం వచ్చే జాబ్ ఉంటే పెళ్లి అన్నారు. నాకు మాత్రం నితిన్పై పూర్తి నమ్మకముంది. మొత్తంమ్మీద నితిన్, తన సోదరుడు నిఖిల్తో కలిసి జీరోధాని ప్రారంభించాం’ అని సీమా పాటిల్ తెలిపారు.
సన్టీవీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్న కావేరీ కళానిధి అత్యధికంగా రూ.88కోట్ల జీతాన్ని తీసుకునేవారు. ఇప్పుడామెని అధిగమించి సీమా ఏడాదికి 100 కోట్ల రూపాయల జీతాన్ని అందుకుంటున్నారు. ‘ఇలాంటి ఆర్థిక సంస్థల్లో అమ్మాయిలు రాణించడం ఆశ్చర్యంగానే ఉండొచ్చు. కానీ… ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఫండ్ మేనేజర్లు, ఫైనాన్షియల్ అనలిస్టులుగా ఎంతో మంది మహిళలు మగవాళ్లకంటే మెరుగ్గా రాణిస్తున్నారు. కారణం మహిళలకు అనలిటికల్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి. దానికి తోడు సహజంగానే మల్టీటాస్కింగ్ అలవాటు వల్ల తేలిగ్గానే ముందడుగు వేస్తున్నారు. మగవాళ్లు మాత్రమే చేయగలరనుకున్న అనేక రంగాల్లో ఇప్పుడు ఆడవాళ్లు తేలిగ్గా రాణించి చూపిస్తున్నారు’ అని సీమ అంటారు. మహిళలు ఏ రంగంలోనూ తగ్గకూడదు అంటూ స్ఫూర్తినిస్తున్నారు సీమా పాటిల్.