మళ్లీ జగనే సీఎం, అవినీతి లేనిది ఎక్కడ, చెడ్డ పనులను పట్టించుకోకూడదు.. దుమారం రేపుతున్న వీసీ వ్యాఖ్యలు

మళ్లీ జగనే సీఎం, అవినీతి లేనిది ఎక్కడ, చెడ్డ పనులను పట్టించుకోకూడదు.. దుమారం రేపుతున్న వీసీ వ్యాఖ్యలు

again ap cm jagan, says vc shyam prasad: ”ఏపీలో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీనే. రెండోసారి జగనే సీఎం అవుతారు. అవినీతి లేనిది ఎక్కడ? కొన్ని చెడ్డ పనులను చూసీ చూడనట్టు వదిలేయాలి. అన్నివర్గాల ప్రజలకు జగన్ మంచి చేస్తున్నారు..” జగన్ ప్రభుత్వ పాలనపై ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అంతేకాదు దుమారం కూడా రేపాయి.

వీసీ వ్యాఖ్యలపై టీడీపీ తీవ్రంగా మండిపడింది. టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదన్నారు. అధికార పార్టీకి తొత్తుగా మారి, విద్యా వ్యవస్థను దిగజారుస్తున్నారని మండిపడ్డారు. వీసీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాజకీయాలపై ఆసక్తి ఉంటే వీసీ పదవికి రాజీనామా చేసి.. వైసీపీలో చేరి, జగన్‌కు భజన చేసుకోవాలని టీడీపీ నేతలు సూచించారు.

శుక్రవారం(ఫిబ్రవరి 19,2021) ఉదయం డాక్టర్ సుశ్రుత విగ్రషావిష్కరణకు వైస్ ఛాన్సలర్ కర్నూలుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభుత్వ పాలనపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు మళ్లీ వైసీపీనే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పి సెన్సేషన్ క్రియేట్ చేశారు.

గత ప్రభుత్వానికి…ఇప్పటి ప్రభుత్వానికి చాలా తేడాలున్నాయని వీసీ అన్నారు. రూ.20 వేల కోట్లు జగన్ హయాంలో మంజూరు చేశారని తెలిపారు. బడ్జెట్‌లో వైద్యశాఖకు గతంలో 2శాతం మాత్రమే కేటాయించేవారన్నారు శ్యాం ప్రసాద్. జగన్ ప్రభుత్వం వచ్చాక 10శాతం వరకు కేటాయించారన్నారు. సీఎం జగన్‌ వేల కోట్ల అప్పులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నారని వీసీ శ్యామ్ ప్రసాద్ ప్రశంసించారు. బీసీ, ఎస్సీ, దర్జీ దగ్గర నుంచి అన్ని వర్గాలకు డబ్బులు ఇస్తున్నారని పొగిడారు. ఏపీలో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీనే అని, రెండోసారి కూడా జగనే సీఎం అవుతారని ఆయన స్పష్టం చేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చినపుడు మేజర్ రెవెల్యూషన్ ఉంటుందన్నారు.

అవినీతి లేనిది ఎక్కడ…. ప్రతి చోట అవినీతి ఉందని వీసీ అన్నారు. ఈ గవర్నమెంట్‌లో చాలా మంచి పనులు చేస్తున్నప్పుడు కొన్ని చెత్త పనులు కూడా ఉంటాయన్నారు. వాటిని చూసీ చూడనట్లు వదిలేయాలన్నారు. దీన్ని రాజకీయంగా చూడటం తప్పు అన్నారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని వీసీ శ్యాం ప్రసాద్ చెప్పారు.

గతంలో తాను సీనియర్‌గా ఉండగా ఇద్దరు.. దొంగ దారిలో డైరెక్టర్లు అయ్యారని.. కోర్టు కూడా రక్షించలేకపోయిందని చెప్పారు. ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు పని చేసే ఏకైక వీసీ తానే అని వైస్ ఛాన్సలర్ శ్యామ్ ప్రసాద్ చెప్పుకొచ్చారు.