గుంటూరులో యుద్ధం : మోడీ గో బ్యాక్ అంటూ ఆందోళనలు

  • Published By: chvmurthy ,Published On : February 9, 2019 / 08:29 AM IST
గుంటూరులో యుద్ధం : మోడీ గో బ్యాక్ అంటూ ఆందోళనలు

విజయవాడ: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం బీజేపీ ఆధ్వర్యంలో గుంటూరులో జరగబోయే  బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు.  రేపు ఉదయం ఆయన గన్నవరం విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా గుంటూరు  వెళతారు.  మోడీ ప్రయాణించే గన్నవరం విమానాశ్రయం నుండి విజయవాడ వరకు జాతీయ రహదారిపై మోడీ నెవెర్ ఎగైన్, మోడీ మరల రావొద్దు అంటూ  నినాదాలు రాసిన హోర్డింగ్స్ రాత్రికి రాత్రి వెలిశాయి. అప్రమత్తమైన పోలీసులు బ్యానర్లు తొలగించే పనిలో పడ్డారు. 

మరోవైపు రేపు మోడీ గుంటూరు పర్యటనకు నిరసనగా శనివారం టీడీపీ, వామపక్ష పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.  టీడీపీ ఎమ్మెల్యేలు సైకిల్ ర్యాలీలు నిర్వహించారు. మోడీ గో బ్యాక్ అంటూ వామపక్ష పార్టీల నేతలు  కుండ, మట్టి చూపిస్తూ,  నల్ల జెండాలతో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. విభజన చట్టంలోని హామీలు అమలు చేయని మోడీ ఏపీకి ఎలా వస్తారని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోశనలు  జరుగుతున్నాయి. అప్రమత్తమైన పోలీసులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.