టీడీపీ నిర్లక్ష్యం చేసిన క్రీడాకారులు దరఖాస్తు చేసుకుంటే ప్రోత్సాహకాలు
జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో పతకాలు సాధించినా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఏపీకి చెందిన క్రీడాకారులకు వైఎస్సార్ క్రీడా ప్రోత్సాహకాలు పధకం కింద నగదు బహుమతులు ఇవ్వాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. సీఎం జగన్ అధ్యక్షతన బుధవారం సెప్టెంబర్ 4న సమావేశం అయిన కేబినెట్ ఇందుకోసం రూ. 5 కోట్ల రూపాయలను కేటాయించింది. కేబినెట్ నిర్ణయాలను సమాచార ప్రసార శాఖ మంత్రి పేర్ని నాని విలేకరులకు తెలిపారు.
గోల్డ్ మెడల్ సాధించిన క్రీడాకారులకి రూ.5 లక్షలు, సిల్వర్ మెడల్ సాధించిన క్రీడాకారులకి రూ.4 లక్షలు, బ్రాంజ్ మెడల్ సాధించిన క్రీడాకారులకి రూ.3 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం పతకాలు సాధించిన వారిలో వారికి నచ్చిన వారికి మాత్రమే ప్రోత్సాహకాలు అందించిందని ఆయన వివరించారు.
పతకాలు సాధించి టీడీపీ ప్రభుత్వంచే నిర్లక్ష్యానికి గురైన క్రీడాకారులు వారి వివరాలతో అప్లయ్ చేసుకుంటే వారందరికీ వైఎస్సార్ క్రీడా ప్రోత్సహాక పధకం కింద బహుమతులు అందిస్తామని మంత్రి తెలిపారు. ఇటీవల బాడ్మింటన్లో స్వర్ణం సాధించిన షట్లర్ సింధుకి ఏపీ కేబినెట్ అభినందనలు తెలిపింది.