‘బండి’కి తెలంగాణ బీజేపీ పగ్గాలు

  • Published By: venkaiahnaidu ,Published On : March 11, 2020 / 11:37 AM IST
‘బండి’కి తెలంగాణ బీజేపీ పగ్గాలు

తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ గా బండి సంజయ్ కుమార్ నియమితులయ్యారు.ఈ మేరకు కేంద్ర బీజేపీ అధిష్ఠానం బుధవారం(మార్చి-11,2020) ఆయన పేరును ఖరారు చేసింది. బండి సంజయ్‌ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్‌ నడ్డా ప్రకటించారు. ప్రస్తుతం బండి సంజయ్ కరీంనగర్ ఎంపీగా ఉన్న విషయం తెలిసిందే.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియామకమైన సంజయ్‌ కుమార్‌కు రాష్ట్ర బీజేపీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని బీజేపీ అధిష్టానం స్పష్టం చేసింది. ఇప్పటి వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్‌ లక్ష్మణ్‌ కొనసాగిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని మార్చుతారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో అధ్యక్ష స్థానం కోసం పలువురు ఆశావహులు పోటీ పడ్డారు. ఇందులో భాగంగా పలువురి పేర్లు పరిశీలనకు వచ్చాయి.

పార్టీ అధిష్ఠానం నుంచి పరిశీలకులు అనీల్ జైన్ తదితరులు తెలంగాణకు వచ్చి ఇక్కడి నేతల అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. ఈసారి కూడా లక్ష్మణ్‌నే అధ్యక్షుడిగా కొనసాగిస్తారన్న ప్రచారమూ సాగింది. వివిధ నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్న అనంతరం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ పేరును ఖరారు చేశారు. బండి సంజయ్ ఏబీవీబీ కార్యకర్త స్థాయి నుంచి రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు. ఈయనకు ఆర్ఎస్ఎస్ నేపథ్యం కూడా ఉంది.

See Also | మధ్యప్రదేశ్ లో మారిన రాజకీయం…బీజేపీకి షాక్ ఇచ్చిన 12మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు