Mandali Buddha Prasad : చంద్రబాబు ఫినిష్.. స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యల వెనుక పెద్ద కుట్ర ఉంది, సీబీఐ విచారణ జరిపించాలి- మండలి బుద్ధ ప్రసాద్

Mandali Buddha Prasad : చంద్రబాబుకి వైసీపీ ప్రభుత్వంతో ఎంతటి ప్రమాదం పొంచి ఉందో అర్థం అవుతుందన్నారు. తమ్మినేని వ్యాఖ్యలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

Mandali Buddha Prasad – Seetharam Thammineni : చంద్రబాబు ఫినిష్ అంటూ ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఆ వ్యాఖ్యలు అగ్గి రాజేశాయి. స్పీకర్ తమ్మినేని సీతారాంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ వ్యాఖ్యలను వారు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ క్రమంలో స్పీకర్ తమ్మినేనిపై అవనిగడ్డ పోలీస్ స్టేషన్ లో టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు.

చంద్రబాబు ఫినిష్ అంటూ స్పీకర్ తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలపై మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ స్పందించారు. చంద్రబాబును ఉద్దేశించి తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవని ఆయన అన్నారు. బాధ్యత గల రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయాలు మాట్లాడకూడదన్నారు.(Mandali Buddha Prasad)

Also Read..Seetharam Thammineni : బ్లాక్ కమాండోస్ లేకపోతే.. చంద్రబాబు ఫినిష్- స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు

గతంలో స్పీకర్ గా ఉన్న సంజీవ రెడ్డి స్పీకర్ పదవిని చేపట్టగానే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారని ఆయన గుర్తు చేశారు. కానీ నేడు తమ్మినేని మాట్లాడుతూ చంద్రబాబుకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ లేకపోతే ఫినిష్ అయిపోతాడని మాట్లాడటం చూస్తే చంద్రబాబుకి వైసీపీ ప్రభుత్వంతో ఎంతటి ప్రమాదం పొంచి ఉందో అర్థం అవుతుందన్నారు. ఇది కేవలం తమ్మినేని వ్యాఖ్యలు మాత్రమే కాదని వైసీపీ పార్టీ వ్యాఖ్యలని మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు.

చంద్రబాబుకి జెడ్ ప్లస్ కేటగిరీ వెనక్కు తీసుకోవాలని కేంద్రానికి లేఖ రాస్తానని స్పీకర్ చెప్పడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అనేది ఉంటే స్పీకర్ తమ్మినేనిపై వెంటనే కేసు నమోదు చేసి చర్య తీసుకోవాలని, తమ్మినేని వ్యాఖ్యలపై సీబీఐ విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.

Also Read..Chandrababu : వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్ల పాలనపై చంద్రబాబు సెటైర్లు

రాజకీయాలకు అతీతంగా మాట్లాడాల్సిన శాసన సభాపతి ఒక రౌడీలా మాట్లాడటం దారుణమని కృష్ణా జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు అన్నారు. చంద్రబాబును ఉద్దేశించి స్పీకర్ తమ్మినేని దారుణంగా మాట్లాడారని మండిపడ్డారు. నిజానికి సీతారాంకు రాజకీయ భిక్ష పెట్టింది నందమూరి తారక రామారావు అని, మంత్రి పదవి ఇచ్చింది చంద్రబాబు అని ఆయన గుర్తు చేశారు.

వాళ్లు కానీ లేకపోతే.. చంద్రబాబు ఫినిష్- స్పీకర్ తమ్మినేని
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో నిన్న (మే 29) వైసీపీ కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు స్పీకర్ తమ్మినేని. ఆ తర్వాత మాట్లాడుతూ.. చంద్రబాబుని ఉద్దేశించి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బ్లాక్ కమాండోస్ భద్రతను తీసేస్తే చంద్రబాబు ఫినిష్ అయిపోతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు ఉన్నారన్న ధైర్యంతోనే చంద్రబాబు మాట్లాడుతున్నారని చెప్పారు. ఎవరిని ఉద్ధరించడానికి చంద్రబాబుకి బ్లాక్ క్యాట్ కమాండోల భద్రత ఇచ్చారని స్పీకర్ తమ్మినేని ప్రశ్నించారు. చంద్రబాబుకున్న బ్లాక్ కమాండోస్ భద్రతను ఉపసంహరించాలని స్పీకర్ హోదాలో కేంద్రాన్ని కోరతానని స్పీకర్ తమ్మినేని చెప్పారు. అసలు.. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతకు చంద్రబాబు ఏ విధంగా అర్హుడని నిలదీశారు. దేశంలో చాలా మంది నాయకులకు ముప్పు పొంచి ఉందని, బెదిరింపులు ఉన్నాయని.. మరి వారందరికి కూడా ఇలానే బ్లాక్ కమాండోస్ తో భద్రత కల్పిస్తారా? అని తమ్మినేని సీతారామ్ ప్రశ్నించారు.

ట్రెండింగ్ వార్తలు