సేకరించింది ఎంత? ఖర్చు పెట్టింది ఎంత? గాంధీభవన్‌లో కాక రేపుతున్న ఎన్నికల విరాళాల లెక్కలు

  • Published By: naveen ,Published On : July 15, 2020 / 12:17 PM IST
సేకరించింది ఎంత? ఖర్చు పెట్టింది ఎంత? గాంధీభవన్‌లో కాక రేపుతున్న ఎన్నికల విరాళాల లెక్కలు

రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరిగి ఏడాది కాలం ముగిసిన తర్వాత కాంగ్రెస్ లో లెక్కలు తేలాలి అంటున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మిత్ర పక్షాలతో కలసి కాంగ్రెస్ వసూలు చేసిన విరాళాలతో పాటు, ఖర్చులపై వివరణ కోరుతున్నారు ఆ పార్టీ నాయకులు. దీనికి సంబంధించి ఏఐసీసీ సభ్యుడు జడ్సన్ రాసిన లేఖ పార్టీ వర్గాల్లో ఇప్పుడు కలకలం రేపుతోంది. ఎన్నికలు జరిగి ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు గతించిన అంశంపై చర్చ పెట్టడం ఏంటని గాంధీ భవన్ వర్గాలు గుస గుసలాడుతున్నాయి.

ఎన్నికల విరాళాలు, ఖర్చులు తెలపాలని లేఖ:
తెలంగాణలో 2018 ఎన్నికల్లో మిత్రపక్షాలతో పోటీ చేసిన కాంగ్రెస్‌ ఘోరంగా దెబ్బతింది. ఆ ఫలితాలను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు హస్తం నేతలు. ఇదిలా ఉండగానే విరాళాల లెక్కకు సంబంధించిన లేఖ కాక రేపుతోంది. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ, జన సమితి, సీపీఐ కలిసి పోటీ చేశాయి. ఈ క్రమంలో కార్పొరేట్ సంస్థలు, పారిశ్రామిక వేత్తల నుంచి భారీగా విరాళాలు సేకరించారు. అయితే బీజేపీ అవినీతి పార్టీగా ముద్ర వేస్తున్న కాంగ్రెస్ ముందుగా తాను క్లియర్‌గా ఉండాలని డిసైడ్‌ అయింది. ఎన్నికల వివరాలపై లెక్కలు తేల్చి.. పక్కాగా క్లారిఫికేషన్‌ ఇవ్వాలని ఏఐసీసీ సభ్యుడు జడ్సన్‌.. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌తో పాటు ముఖ్య నేతలకు లేఖ రాశారు. ఈ ఉత్తరమే ఇప్పుడు గాంధీభవన్‌లో చర్చగా మారి రచ్చ చేస్తోందట.

ఆ డబ్బులు సొంతానికి వాడుకున్నారని ఆరోపణలు:
కాంగ్రెస్‌ పార్టీ టీడీపీతో జతకట్టి భారీగా నిధులు రాబట్టిందని సమాచారం. అయితే పోటీ చేసే అభ్యర్థులకు, ప్రచారానికి అవసరమైన ఖర్చులకి వినియోగించకుండా వ్యక్తిగత ప్రయోజనాలకు వినియోగించారనే ఆరోపణలు చాలా రోజులుగా వినిపిస్తున్నాయి. డబ్బు సరిగా ఖర్చు పెట్టని కారణంగానే ఓటమిపాలయ్యామని కొంతమంది కాంగ్రెస్ నేతలు బాహాటంగానే విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నికలు అయిపోయి ఏడాది గడిచాక ఈ లెక్కల లొల్లేంటని కొంతమంది నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారట.

కార్పొరేట్ సంస్థల నుంచి వచ్చిన మొత్తం ఎంత? ప్రచార సామాగ్రికి ఖర్చు పెట్టిన నగదు ఎంత?
జడ్సన్ రాసిన లేఖలో ప్రధానంగా ఏడు ఆంశాలు ఉన్నాయి.
* ఏఐసీసీ నుంచి వచ్చిన విరాళాలు ఎన్ని..?
* మిత్ర పక్ష పార్టీల నుంచి వచ్చిన మొత్తం ఎంత..?
* పారిశ్రామిక వేత్తలు, కార్పొరేట్ సంస్థల నుంచి వచ్చిందెంత..?
* ఎన్నికల ప్రచారం కోసం చేసిన ఖర్చెంత..?
* ప్రచార సామాగ్రి, మెటిరియల్‌కు ఎంత వెచ్చించారు..?
* మీడియా ప్రకటనకు చేసిన ఖర్చు ఎంత?
ఇలా ఈ వివరాలపై పాయింట్ టు పాయింట్‌ లెక్క చెప్పాలన్నది లేఖ సారాంశంగా కనిపిస్తోంది. మొత్తం ఏడు అంశాలపై టీపీసీసీ కోర్‌ కమిటీ వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు జడ్సన్.

ఇప్పుడెందుకు తోడుతున్నారు?
నిధులు సరిగా ఉపయోగించని కారణంగానే కాంగ్రెస్‌ ఓడిపోయిందన్నది ఆ పార్టీ నేతల వాదన. అయితే ఉన్న పళంగా ఈ లెక్కలు ఎందుకు తోడుతున్నారన్నది అంతుపట్టడం లేదు. నిజంగానే లెక్కలు తేల్చాలని కొంతమంది నేతలు అభిప్రాయపడుతుంటే.. మరికొందరు మాత్రం లేఖలు, ఆరోపణలతో వచ్చేదేం లేదని కొట్టిపారేస్తున్నారు.