వీడిన సస్పెన్స్.. సాగర్ బై పోల్.. వ్యూహాత్మకంగా అభ్యర్థిని ఎంపిక చేసిన బీజేపీ

వీడిన సస్పెన్స్.. సాగర్ బై పోల్.. వ్యూహాత్మకంగా అభ్యర్థిని ఎంపిక చేసిన బీజేపీ

Dr Panugothu Ravi Kumar

Dr Panugothu Ravi Kumar : నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉపఎన్నికకు బీజేపీ అభ్యర్థి విషయంలో ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. అభ్యర్థి ఎంపికపై తీవ్ర కసరత్తు చేసిన బీజేపీ.. డాక్టర్ పానుగోతు రవికుమార్ పేరుని ఖరారు చేసింది. నామినేషన్ కు చివరి రోజు కావడంతో మధ్యాహ్నం రవికుమార్ నామినేషన్ వేయనున్నారు. ముందు నుంచి చెప్పినట్టుగానే టీఆర్ఎస్ అభ్యర్థి ప్రకటన తర్వాతే తమ అభ్యర్థిని ప్రకటిస్తామన్న బీజేపీ అన్నట్లుగానే చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గిరిజనులను ఓటు బ్యాంకుగా మార్చుకునే వ్యూహంలో భాగంగానే రవికుమార్ నాయక్ పేరుని ప్రకటించింది బీజేపీ. జనరల్ స్థానంలో గిరిజనులకు టిక్కెట్ ఇచ్చామని బీజేపీ ప్రచారం చేస్తోంది. ఇప్పటికే గిరిజనుల సమస్యలపై ఉద్యమాలు చేస్తున్నారు కమలనాథులు.

మరోవైపు టిక్కెట్ ఆశించిన నివేదితా రెడ్డి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. కాగా, రవికుమార్ కు పార్టీ అధిష్టానం చాన్స్ ఇవ్వడంతో ఆమెకు నిరాశ ఎదురైంది. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని నివేదితా రెడ్డి తెలిపారు. నామినేషన్ విత్ డ్రా చేసుకుంటానని చెప్పారు.

కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్ బరిలో ఉన్నారు. జానారెడ్డి చాలా సీనియర్ కాగా, నోముల భగత్.. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు.