బీజేపీ యాత్రా స్పెషల్ : ఏపీలో బస్సు యాత్ర
విజయవాడ: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో పట్టుసాధించేందుకు కమలనాధులు యత్నాలు మొదలెట్టారు. అందులో భాగంగా ఏపీలో బస్సు యాత్ర చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. బస్సుయాత్రను ఫిబ్రవరి 4న శ్రీకాకుళం జిల్లా పలాసలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రారంభించనున్నారు. యాత్ర నిర్వహణకు పార్టీ 8కమిటీలను ఏర్పాటుచేసింది. 15రోజుల్లో 85 నియోజకవర్గాల మీదగా యాత్ర కొనసాగి కర్నూలు జిల్లా ఆదోనిలో ముగిసేలాగా రూట్ మ్యాప్ సిధ్ధం చేస్తున్నారు.
బస్సుయాత్రలో ప్రధానంగా రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వంలో పెరిగిపోయిన అవినీతి, కేంద్రం రాష్ట్రానికి అందించిన సాయాన్ని ప్రజల్లో తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈబస్సుయాత్ర
ఏర్పాటు చేస్తున్నారు. బస్సు యాత్రలో భాగంగా జిల్లాల్లోని ప్రధాననగరాల్లో బహిరంగసభలు ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి జిల్లాలో కేంద్ర మంత్రులు పాల్గొనేలా ప్రణాళికలు రూపోందిస్తున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు రేపు రాష్ట్ర ఇన్ చార్జులతో కలిసి యాత్రకు మెరుగులు దిద్దనున్నారు.