తెలంగాణలో కొత్త రాజకీయం, ప్రత్యర్థి టీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తు? దీని వెనుక రెండు ప్రధాన కారణాలు
congress alliance with trs in telangana: తెలంగాణలో జాతీయ పార్టీల మధ్య పోరు కొత్త పుంతలు తొక్కబోతోందని అంటున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేయడంతో కాంగ్రెస్ పార్టీ కొత్త రూట్లో తన ట్రయల్స్ మొదలుపెట్టిందని టాక్. ఈ ఉప ఎన్నికలో బీజేపీ గెలుపొందగా.. టీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి మైండ్ బ్లాక్ అయినంత పనయ్యింది. పార్టీ అగ్రనాయకత్వం అంతా బరిలో దిగి, ప్రచారం చేసినా కనీసం డిపాజిట్ కూడా దక్కకపోవడంతో సీనియర్ నేతలు ఆలోచనలో పడ్డారని అంటున్నారు.
తెలంగాణలోనూ బీజేపీ విస్తరిస్తుందనే ఆందోళనలో కాంగ్రెస్
ఉత్తర భారతదేశం మాదిరిగా తెలంగాణలో కూడా బీజేపీ విస్తరించే అవకాశం ఉండటంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఒక ఆలోచన చేశారనే చర్చ మొదలైంది. ఇక మీదట జరిగే ఎన్నికల్లో బీజేపీని నిలువరించేందుకు ఒక ప్లాన్ వేసిందంటున్నారు. ఇప్పటి వరకూ ప్రత్యర్థిగా ఉన్న టీఆర్ఎస్తో కలసి పనిచేయక తప్పదేమోనని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నుంచే ఈ సూత్రం పాటించక తప్పదంటూ మీడియా చిట్చాట్లో అభిప్రాయపడుతున్నారు.
పార్టీ భవిష్యత్ కోసం టీఆర్ఎస్తో కలవడమే బెటర్ అనుకుంటున్నారా?
దుబ్బాక ఫలితం రాగానే కాంగ్రెస్ సీనియర్లు ఫలితాలపై అనేక రకాలుగా డిస్కషన్స్ చేశారు. ఓవరాల్గా ఫలితాలు నిరాశజనకంగా ఉండటంతో పార్టీ నిలబడాలంటే ఏదో ఒక అద్భుతం చేయక తప్పదని డిసైడ్ అయ్యారట. భవిష్యత్తులో పార్టీని నిలబెట్టాలనే టీఆర్ఎస్తో కలసి ముందుకెళ్లడమే సరైన మార్గంగా భావిస్తున్నారని కాంగ్రెస్ అంతర్గత చర్చల్లో అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయని చెవులు కొరుక్కుంటున్నా. ఒకరిద్దరు నేతలు ఓ ఐడియాలజీ ప్రకారం టీఆర్ఎస్తో కలసి బీజేపీని నిలువరించాల్సిన అవసరం ఉందని కామెంట్ చేశారట.
https://10tv.in/ktr-fires-on-bjp-ghmc-elections-campaign/
టీఆర్ఎస్తో పొత్తు తప్పేం కాదన్న అభిప్రాయంలో కాంగ్రెస్ నేతలు:
మరోపక్క, బీజేపీ బలపడితే టీఆర్ఎస్కు కూడా ఇబ్బందేనన్న అభిప్రాయం వ్యక్తం అయ్యిందని అంటున్నారు. దీంతో టీఆర్ఎస్ కూడా తమతో కలిసి రాక తప్పదని కాంగ్రెస్ నాయకులు ఆశిస్తున్నారని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంది. అలాంటప్పుడు ఇక్కడ కూడా టీఆర్ఎస్తో పొత్తు తప్పేం కాదనే ఓ నిర్ణయానికి వచ్చారట. ఇప్పుడు ఈ విషయంలో టీఆర్ఎస్తో సంప్రదింపులు జరిపి.. వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని భావిస్తున్నారని టాక్. మొత్తం మీద తెలంగాణ కాంగ్రెస్ ముందుకు తీసుకొస్తున్న ఈ ఆఫర్ను గులాబీ పార్టీ సీరియస్గా తీసుకుంటుందా? లేదా లైట్ తీసుకొని వదిలేస్తుందా? అనేది గాంధీభవన్ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి.