తెలంగాణలో కరోనా : నల్గొండలో వియత్నాం వాసులు..గాంధీకి తరలింపు

  • Published By: madhu ,Published On : March 20, 2020 / 04:42 AM IST
తెలంగాణలో కరోనా : నల్గొండలో వియత్నాం వాసులు..గాంధీకి తరలింపు

తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ – 19 (కరోనా) వైరస్ కేసులు ప్రబలుతున్న నేపథ్యంలో…నల్గొండ జిల్లాకు విదేశీయులు రావడం కలకలం రేపుతోంది. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో విదేశీయులకు కరోనా పాజిటివ్ రావడంతో విదేశీయులను చూస్తే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నల్గొండలోని జైల్ ఖానా సమీపంలో ఉన్న ప్రార్థనా మందిరంలో ఉన్న 14 మంది వియత్నాం వాసులు సంచరించినట్లు అధికారులు గుర్తించారు. 2020, మార్చి 09వ తేదీన ఢిల్లీ ఎయిర్ పోర్టులో వీరు దిగారు. అక్కడి నుంచి ట్రైన్ ద్వారా నాంపల్లికి చేరుకున్నారు. అనంతరం అదే రోజు శబరి ఎక్స్ ప్రెస్ ఎక్కి..నల్గొండ జిల్లాకు వచ్చారు. 

సమాచారం తెలుసుకున్న జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వీరిని 2020, మార్చి 20వ తేదీ శుక్రవారం 14 మంది వియత్నాం వాసులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఏమైనా కరోనా లక్షణాలున్నాయా ? అనే అనుమానంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇన్ని రోజులవుతున్నా..వారిలో కరోనా లక్షణాలు లేవని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముందస్తు జాగ్రత్తలో భాగంగా పరీక్షలు నిర్వహించడం జరిగిందని వైద్యులు వెల్లడిస్తున్నారు. 

నల్గొండ జిల్లాకు మొత్తం 65 మంది విదేశీయులు వచ్చినట్లు అధికారులు నిర్ధారించారు. వీరు ఎక్కడ తిరిగారు ? ఎవరెవరిని కలిశారనే దానిపై ఆరా తీస్తున్నారు. వారి కదలికలపై నిఘా పెట్టడం జరిగిందన్నారు. ప్రస్తుం వియాత్నం వాసులకు సంబంధించిన రిపోర్టులు వచ్చిన అనంతరం వీరికి కరోనా వైరస్ సోకిందా ? లేదా ? అనేది తేలనుంది. 

జిల్లాలో విదేశీయులు ఉంటే…సమాచారాన్ని తెలియచేయాలని స్వచ్చందంగా వారు క్వారంటైన్‌కు వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలతో అధికారులు అలర్ట్ అయ్యారు. విదేశీయుల గురించి ఆరా తీస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉంటూ..విదేశాలకు వెళ్లిన వారిని కూడా గుర్తిస్తున్నారు. వీరి డేటాను కూడా సేకరిస్తున్నారు. 
Read More : విశాఖలో కరోనా పాజిటివ్ కేసు : ఏపీ హెల్త్ బులెటిన్ విడుదల