కాంగ్రెస్‌కి బిగ్ షాక్ : BJPలోకి డీకే అరుణ

  • Published By: madhu ,Published On : March 19, 2019 / 04:13 PM IST
కాంగ్రెస్‌కి బిగ్ షాక్ : BJPలోకి డీకే అరుణ

కాంగ్రెస్ పార్టీ నుండి ఒక్కొక్క నేత జారిపోతున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన వారు..మాజీ నేతలు పార్టీకి రాం..రాం చెబుతూ ఇతర పార్టీల కండువాలు కప్పుకుంటున్నారు. దీనితో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం పడిపోతోంది. ఇప్పటికే చాలా మంది నేతలు TRS వైపు మొగ్గు చూపితే మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేతగా ఉన్న డీకే అరుణ మాత్రం BJP వైపు చూస్తున్నారు. ఆమె త్వరలోనే కాషాయ కండువా కప్పుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. 

పార్టీలో చేరే విషయంపై బీజేపీ అధిష్టానంతో చర్చించడానికి డీకే అరుణ ఢిల్లీకి వెళ్లారు. పార్టీ అధిష్టాన పెద్దలతో చర్చలు జరుగుతున్నాయి. మహబూబ్ నగర్ ఎంపీ స్థానం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీ సీనియర్ నేత రామ్ మాధవ్ చర్చల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని సమాచారం. ఈ చర్చలు సక్సెస్ అయితే డీకే అరుణ ఎంపీగా ఎన్నికల బరిలో నిలువబోనున్నారు. 

మహబూబ్ నగర్ జిల్లా గద్వాల నుండి కాంగ్రెస్ పార్టీ తరపున కీలక నేతగా ఉన్నారు. 1978 నుంచి గద్వాలపై డీకే ఫ్యామిలీ హావా నడిపిస్తూ వచ్చింది. ఇంటర్ మీడియట్ వరకు చదివిన డీకే అరుణ గద్వాల సీనియర్ కాంగ్రెస్ నేత భరత  సింహారెడ్డిని వివాహమాడారు. వీరి కుటుంబంలో అందరూ రాజకీయ నేతలే. ఒక్కమాటలో చెప్పాలంటే పుట్టినిల్లు, మెట్టినిల్లు రాజకీయ నిలయాలు. 1996లో మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయారు. 1998లో కూడా పరాజయం చెందారు. 1999లో గద్వాల అసెంబ్లీకి పోటీ చేసినా ఫలితం దక్కలేదు. 2004లో SP పార్టీ తరపున గద్వాల నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి సంచలనం సృష్టించారు. 2007లో సమాజ్ వాదీ బహిష్కరించడంతో 2009లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి గెలుపొందారు. 2009లో ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో పని చేసి తొలి మహిళా నేతగా పేరు పొందారు. 2014లో గద్వాల నుండి కాంగ్రెస్ నుండి పోటీ చేసి విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రంలో 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో డీకే అరుణ ఓటమి పాలయ్యారు.