ఢిల్లీ రాజకీయాల్లోకి మాజీ ఎంపీ కవిత ఎంట్రీ?

  • Published By: sreehari ,Published On : December 25, 2019 / 12:33 PM IST
ఢిల్లీ రాజకీయాల్లోకి మాజీ ఎంపీ కవిత ఎంట్రీ?

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కరలేని నాయకురాలు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత. రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండే ఆమె.. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. కొందరు సొంత పార్టీ ఎమ్మెల్యేలు పని గట్టుకుని ఆమె ఓటమికి కారణమయ్యారని అప్పట్లో పార్టీలో జోరుగా ప్రచారం జరిగింది.

ఈ ప్రచారంపై నిజానిజాలు తేల్చేందుకు మాజీ ఎంపీ రహస్య విచారణ చేయించారట. ఈ విషయం రాష్ట్ర స్థాయిలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఆ విచారణలో నిజం తెలుసుకున్నారని అంటున్నారు. ఈ కారణంగానే కవిత కొద్ది కాలంగా రాజకీయాలకు, వివిధ వేడుకలకు దూరంగా ఉన్నారట. లోలోపల జరిగిన వ్యవహారం కారణంగా జిల్లా నేతలకు ఎవరినీ కలిసేందుకు కూడా కవిత ఇష్టపడలేదంట.

రాజ్యసభ సభ్యురాలి హోదాలో :
ఇప్పుడు గతం గతః అనుకొని కొద్ది రోజుల నుంచి ఆమె మళ్లీ యాక్టివ్ అయ్యారట. వివిధ వేడుకల్లో పాల్గొంటూనే.. తన ముఖ్య అనుచరులను కలుస్తున్నారని చెబుతున్నారు. రాజకీయంగా ఆమె సైలెంట్‌గా ఉన్న కాలంలో కొందరు ఎమ్మెల్యేలు పండగ చేసుకున్నారనే ప్రచారం జరిగింది. అయితే రాజ్యసభ సభ్యురాలి హోదాలో అతి త్వరలో మళ్లీ ఆమె యాక్టివ్ కాబోతున్నారనే ప్రచారం మొదలవ్వడంతో కొందరు నేతలకు మింగుడు పడటం లేదని జనాలు అనుకుంటున్నారు.

త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల ప్రచార బాధ్యతలు సైతం కవితకు అప్పగించే అవకాశం ఉందనే ప్రచారంతో అలెర్ట్ అయిన ఎమ్మెల్యేలు మున్సిపల్ శాఖ మంత్రిని ఎవరికి వారే కలుస్తున్నారట. అతి త్వరలో ఖాళీ అయ్యే ఓ రాజ్యసభ సభ్యుని స్థానంలో కల్వకుంట్ల కవిత రాజ్యసభ సభ్యురాలిగా ఢిల్లీ రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నారట. అటు ఢిల్లీతో పాటు సంక్రాంతి తర్వాత జరిగే మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సైతం తన పార్లమెంట్ సెగ్మెంట్ ప్రచార బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది.

నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు ఆర్మూర్, బోధన్, భీమ్‌గల్ మున్సిపాలిటీల్లో తన మార్క్ ప్రచారంతో గులాబీ జెండా ఎగురేస్తారనే ధీమాలో పార్టీ అధిష్ఠానం ఉంటే.. ఆమె వస్తేనే తమకు న్యాయం జరుగుతుందని ఆమె అనుచరులు ఎదురు చూస్తున్నారట.

పసుపు రైతుల అంశంమే అస్త్రం :
కొందరు ఎమ్మెల్యేలు మాత్రం తామే ఆ బాధ్యతలు చూస్తామని అనుచరుల వద్ద వాపోతున్నారట. మున్సిపల్ ఎన్నికల ప్రచార బాధ్యతలు ఎట్టి పరిస్ధితుల్లో కవిత తీసుకోరని చెబుతున్నారట. కానీ కవిత రాక కోసం ఎదురుచూస్తున్న నేతలు, కార్యకర్తలు మాత్రం ఆలస్యం జరిగినా రావడం పక్కా అంటున్నారు.

మళ్ళీ పాత రోజులు వస్తాయని కొందరు ఖుషీగా ఉంటే మరికొందరు మాత్రం ఆ పాత రోజులుతో తమ ప్రాధాన్యం తగ్గుతుందని దిగులు చెందుతున్నారని జనం అనుకుంటున్నారు. జిల్లాలో తన మార్క్ రాజకీయం చూపెట్టేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్న కవితకు… పసుపు రైతుల అంశం ఓ అస్త్రంగా దొరికిందంటున్నారు.

పసుపు రైతుల ఉద్యమానికి కవిత నాయకత్వం వహించాలని మహిళా రైతుల నుంచి డిమాండ్ వస్తుండటంతో పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుందనే విషయంపై చర్చించారట ఆమె. గతంలో తాను చేసిన ప్రయత్నాలను వివరించడంతో పాటు పసుపు బోర్డు , మద్దతు ధర కోసం రోడ్డు ఎక్కుతున్న రైతులకు అండగా ఉండేందుకు పాదయాత్ర చేయాలనే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు.

ఈ పాదయాత్ర ఎంత వరకు ప్లస్.. ఎంత వరకు మైనస్ అనే అంశంపై తన దగ్గరకు వచ్చిన నేతలతో చర్చించారని అంటున్నారు. ఇంకా ఏ నిర్ణయం తీసుకోకపోయినా రైతుల నుంచి ఒత్తిడి పెరిగితే ఉద్యమంలోకి రావడం ఖాయం అని మాత్రం చెబుతున్నారట. ఏం జరుగుతుందో కొద్ది రోజుల్లో తేలిపోతుందని అంటున్నారు.