ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. గ్రాడ్యుయేట్లు ఓటు ఎలా నమోదు చేసుకోవాలంటే?
Graduates vote for MLC elections : తెలంగాణలో మరో ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమైంది. జీహెచ్ఎంసీ, నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికతో పాటు రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. దుబ్బాక ఉప ఎన్నిక కూడా అనివార్యమైంది.
ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయ పరిస్థితుల దృష్ట్యా దుబ్బాకతో పాటు నిజామాబాద్ ఎమ్మెల్సీ, గ్రేటర్ ఎన్నికల్లో ఫలితాలు అధికార టీఆర్ ఎస్కు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పట్టభద్రుల కోటాలో జరిగే రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కోసం టీఆర్ఎస్తో పాటు విపక్షాలు సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలపై ప్రధాన పార్టీలన్నీ కన్నేశాయి.
ఖమ్మం-వరంగల్-నల్గొండ జిల్లాలు ఒక నియోజకవర్గం, హైదరాబాద్-రంగారెడ్డి-ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలను మరో నియోజకవర్గంగా విభజించారు. ఈ రెండు నియోజకవర్గాల్లోని పట్టభద్రులు ఆయా పార్టీలు బలపరిచిన ప్రధాన అభ్యర్థులను ఓటు హక్కుతో ఎన్నుకోనున్నారు.
పట్టభద్రల కోటాలో జరిగే ఎన్నికకు ఎవరు అర్హులు, అనర్హులు అనేదానిపై ఇప్పటికీ కొంతమందిలో సందేహాలు ప్రారంభమయ్యాయి. అర్హులంతా ఓటు హక్కును తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం కూడా పిలుపునిచ్చింది. పట్టభద్రుల ఓటు హక్కు ఎలా నమోదు చేసుకోవాలి
అనేదానిపై ఈసీ గతంలోనే పలు మార్గదర్శకాలను విడుదల చేసింది.
పట్టభద్రుల కోటాలో జరిగే ఎన్నికల్లో ఓటు నమోదు చేసుకోవాలని అనుకునే వారు ఖచ్చితంగా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఈ ఏడాది నవంబర్ నాటికి డిగ్రీ పాస్ అయ్యి మూడేళ్లు పూర్తి చేసి ఉండాలి. వారే ఓటరుగా నమోదు చేసుకోవడానికి అర్హులు.
ఖమ్మం-వరంగల్-నల్గొండతో పాటు హైదరాబాద్-రంగారెడ్డి-ఉమ్మడి మహబూబ్నగర్ నియోజకవర్గాల నుంచి ఎన్నికైన సభ్యుల పదవీకాలం 2021 మార్చి 29 నాటికి పూర్తి కానుంది. గడువు ముగిసేలోపే ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటరు నమోదు కార్యక్రమానికి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయింది.
అక్టోబర్ 1వ తేదీ నుంచి అర్హులైన వారు నమోదు చేసుకోవాలని పేర్కొంది. 2015 ఎన్నికల్లో ఓటర్ల జాబితాను పూర్తిగా రద్దు చేశారు. 2017 నాటికి పట్టభద్రులైన వారు అక్టోబర్ 1వ తేదీనుంచి దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది.
ఓటరు నమోదు ఎలా?:
నవంబర్ 1 నాటికి డిగ్రీ పూర్తి చేసి మూడేళ్లు పూర్తి అయిన వాళ్లు.. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఓటరుగా నమోదు చేసుకోవాలి. వ్యక్తిగతంగా గానీ, ఆన్లైన్ ద్వారా గానీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్నికలు జరిగే జిల్లాల్లో అధికారులు పోలింగ్ కేంద్రాల వారిగా అధికారులను నియమిస్తున్నారు. అర్హులైన వారు వారి వద్ద నమోదు చేసుకోవాలి. ఆధార్ కార్డు, డిగ్రీ పట్టాతో పాటు మరికొన్ని ఇతర డాక్యుమెంట్లు జతచేయాల్సి ఉంటుంది. ఆల్లైన్ ద్వారా ఓటరుగా నమోదు చేసుకునే వెసులుబాటును ఎన్నికల సంఘం కల్పించింది.
ఆన్లైన్లో ceotelangana.nlc.in లేదా http://www.nvsp లింక్ ద్వారా ఫారం 18ను పూర్తి చేయాలి. రెండు ద్రువపత్రాలు స్కాన్చేసి అప్లోడ్ చేయాలి. దీనికి నవంబర్ 11వ తేదీ వరకు గడువు ఉంది. డిసెంబర్ 1న ఓటరు ముసాయిదాను ప్రకటిస్తారు. తుది ఓటర్లు జాబితాను జనవరి 18 ప్రకటించనున్నారు. గత ఎన్నికల సమయంలో ఓటు హక్కును నమోదు చేసుకున్న వారు సైతం మరోసారి దరఖాస్తు చేసుకోవాలని ఇటీవల రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శంశక్ గోయల్ తెలిపారు.
పాతవారు సైతం మరోసారి ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సిన అవసరముంది. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమయ్యే పట్టభద్రుల ఓటరు నమోదులో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు అర్హతను బట్టి తమ ఇంటి నుంచే నమోదు ప్రక్రియను ప్రారంభించాలని నేతలకు ఆదేశాలు జారీచేసింది.