ఆ సీనియర్ ఐపీఎస్ తో దేశానికి ముప్పు.. అందుకే వేటు

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం సస్పెండ్‌ చేయడం సంచలనంగా మారింది. అదనపు డీజీగా పనిచేసిన సమయంలో భద్రతా పరికరాల కొనుగోళ్లలో

  • Published By: veegamteam ,Published On : February 9, 2020 / 04:02 AM IST
ఆ సీనియర్ ఐపీఎస్ తో దేశానికి ముప్పు.. అందుకే వేటు

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం సస్పెండ్‌ చేయడం సంచలనంగా మారింది. అదనపు డీజీగా పనిచేసిన సమయంలో భద్రతా పరికరాల కొనుగోళ్లలో

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ ప్రభుత్వం సస్పెండ్‌ చేయడం సంచలనంగా మారింది. అదనపు డీజీగా పనిచేసిన సమయంలో భద్రతా పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంతో ఏబీపై ప్రభుత్వం వేటు వేసింది. ఈ మేరకు డీజీపీ నుంచి ఫిబ్రవరి 7న అందిన నివేదిక ఆధారంగా వెంకటేశ్వరరావుపై చర్యలు తీసుకుంటున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొంది. సస్పెన్షన్‌ కాలంలో ప్రభుత్వ అనుమతి లేకుండా ఆయన హెడ్‌ క్వార్టర్స్‌ విడిచి వెళ్లకూడదని ఆదేశించింది. 1989 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి అయిన ఏబీ వెంకటేశ్వరరావును ప్రజా ప్రయోజనాల రీత్యా సస్పెండ్‌ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో వివరించింది. 

చంద్రబాబు హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పనిచేసిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు.. విధి నిర్వహణలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆల్‌ ఇండియా సర్వీసెస్‌ నిబంధనల నియమం కింద సస్పెండ్‌ చేసినట్లు ఆదేశాల్లో పేర్కొన్నారు. వెంకటేశ్వరరావు అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌గా ఉండగా భద్రతా పరికరాల కొనుగోలు టెండర్లలో అవకతవకలకు పాల్పడినట్లు తేలడంతో సస్పెండ్‌ చేసినట్లు జీవో నంబర్‌ 18లో పేర్కొన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా ఇజ్రాయెల్ సంస్ధ నుంచి నిఘా పరికరాల కొనుగోలు చేశారని, ఇంటిలిజెన్స్ చీఫ్ గా ఉన్నప్పుడు ఇజ్రాయెల్ సంస్ధతో కుమ్మక్కై కుమారుడు చేతన్‌ సాయికృష్ణ సంస్ధకు కాంట్రాక్టు ఇప్పించాడని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇది అఖిల భారత సర్వీసుల నిబంధనల ఉల్లంఘనే అని ప్రభుత్వం చెబుతోంది. 

విదేశీ సంస్ధతో నిఘా సమాచారం పంచుకోవడంతో జాతీయ భద్రతకు ముప్పు కలిగించారని ఆరోపించింది. నాణ్యత లేని నిఘాపరికరాల కొనుగోలు ద్వారా దేశ, రాష్ట్ర భద్రతకు ముప్పు కలిగించారని ప్రభుత్వం తెలిపింది. దీంతోపాటు వెంకటేశ్వరరావు ఉద్దేశపూర్వకంగానే ఇంటెలిజెన్స్ ప్రోటోకాల్స్, విధానాలను బహిర్గతం చేశారని ఆరోపించింది. ఇది రాష్ట్రం, దేశ ద్రోహమని తన ఉత్తర్వుల్లో చెప్పింది. ఏబీ వెంకటేశ్వరరావుతో దేశానికి ముప్పు ఉందని ప్రభుత్వం చెప్పింది.

సస్పెన్షన్‌లో ఉన్న కాలంలో ప్రభుత్వం అనుమతి లేనిదే వెంకటేశ్వరరావు విజయవాడలోని హెడ్ క్వార్టర్స్‌ను వీడి వెళ్లరాదని ఆదేశాలిచ్చింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏబీ వెంకటేశ్వరరావు ఇంటెలిజన్స్ చీఫ్‌గా వ్యవహరించారు. వైసీపీ ఫిర్యాదు మేరకు గత ఎన్నికలకు ముందు ఆయన్ను ఇంటెలిజన్స్ చీఫ్ పదవి నుంచి ఎన్నికల సంఘం బదిలీ చేసింది. గతంలోనే ఆయన్ను బదిలీ చేసిన ప్రభుత్వం కొన్నాళ్లు పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెట్టింది. ఇప్పుడు సస్పెన్షన్ ఆర్డర్ జారీ చేసింది. ఏబీ వెంకటేశ్వరరావు మీద వచ్చిన ఆరోపణలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే సస్పెండ్ చేస్తున్నట్టు ప్రభుత్వం జారీ చేసిన జీవోలో స్పష్టం చేసింది.