Liquor Prohibition: బిహార్లో మద్యనిషేధంపై అధికార పార్టీ నేత సంచలన వ్యాఖ్యలు.. చిక్కుల్లో సీఎం!
కుశ్వాహా వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ సమర్ధించింది. ఆయన చెప్పిన మాటలు వంద శాతం వాస్తవమని, మద్యపాన నిషేధంలో నితీశ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ నేత నిఖిల్ ఆనంద్ విమర్శించారు. నిజానికి సోమవారం ఇదే విషయమై సీఎం నితీశ్ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో నిషేధం ఉన్నప్పటికీ మద్యపానం విక్రయాలు జరుగుతుండడంపై రిపోర్ట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
Liquor Prohibition: బిహార్లో మద్యనిషేధంపై అధికార పార్టీనేత చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ను చిక్కుల్లోకి నెట్టేలా ఉన్నాయి. ఎన్నికల హామీలో భాగంగా రాష్ట్రంలో అధికారికంగా ప్రభుత్వం మద్యపాన నిషేధ చట్టం చేసింది. అయితే ఇది వాస్తవంలో సరిగా అమలు కావడం లేదనే విషయం ప్రభుత్వ డేటా చూస్తేనే తెలుస్తోంది. ఇదే విషయమై జనతా దళ్ యూనైటెడ్ పార్లమెంటరీ బోర్డ్ చైర్మన్ ఉపేంద్ర కూష్వాహా స్పందిస్తూ.. రాష్ట్రంలో మద్యపాన నిషేధం విజయవంతం కాలేదని అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే అనేక విమర్శలు ఎదుర్కొంటుంటగా.. అధికార పార్టీ నేతే మద్యపాన నిషేధం అంశంలో ప్రభుత్వం విఫలమైందని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.
‘‘బిహార్లో మద్యపాన విక్రయాన్ని మాత్రమే ప్రభుత్వం ఆపగలిగింది. అది కూడా చట్టాల ద్వారా.. కానీ, మద్యపాన సేవనాన్ని నిరోధించలేకపోయింది. నిషేధం అని ప్రభుత్వం అనుకుని చట్టం చేస్తే అది అమలు కాదు. ప్రజల నుంచి కూడా దానికి అనుగుణంగా స్పందన రావాలి. అమ్మకానికంటే ముందు తాగడం మాన్పించాలి. అది చేయకుండా అమ్మకాలు ఆపేసినంత మాత్రాన ఉపయోగం ఉండదు. బిహార్లో మద్యనిషేధంలో ప్రభుత్వం విజయవంతం కాలేదు. మద్యపాన నిషేధాన్ని ప్రభుత్వం పూర్తిగా అమలు చేయలేకపోయింది. దొంగచాటు విక్రయాల వల్ల కొన్ని నేరాలు కూడా పెరిగాయి. ఈ నిషేధం మిశ్రమ ఫలితాల్ని ఇచ్చింది’’ అని కుశ్వాహా అన్నారు.
కాగా, కుశ్వాహా వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ సమర్ధించింది. ఆయన చెప్పిన మాటలు వంద శాతం వాస్తవమని, మద్యపాన నిషేధంలో నితీశ్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ నేత నిఖిల్ ఆనంద్ విమర్శించారు. నిజానికి సోమవారం ఇదే విషయమై సీఎం నితీశ్ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో నిషేధం ఉన్నప్పటికీ మద్యపానం విక్రయాలు జరుగుతుండడంపై రిపోర్ట్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.