అమరావతి పేరు నచ్చకపోతే YSR పేరు పెట్టుకో : జ్యోతుల నెహ్రూ

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించొద్దు అని చెప్పిన వ్యక్తే.. ఇవాళ అధికారంలోకి వచ్చాక మాట మార్చారని.. అదే పని చేస్తున్నారని సీఎం జగన్ పై టీడీపీ

  • Published By: veegamteam ,Published On : December 30, 2019 / 07:58 AM IST
అమరావతి పేరు నచ్చకపోతే YSR పేరు పెట్టుకో : జ్యోతుల నెహ్రూ

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించొద్దు అని చెప్పిన వ్యక్తే.. ఇవాళ అధికారంలోకి వచ్చాక మాట మార్చారని.. అదే పని చేస్తున్నారని సీఎం జగన్ పై టీడీపీ

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించొద్దు అని చెప్పిన వ్యక్తే.. ఇవాళ అధికారంలోకి వచ్చాక మాట మార్చారని.. అదే పని చేస్తున్నారని సీఎం జగన్ పై టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు. అమరావతి రాజధానిగా నాడు అంగీకారం తెలిపిన జగన్.. నేడు ఎందుకు మాట మార్చారు అని ప్రశ్నించారు. కాకినాడలో మీడియాతో మాట్లాడిన జ్యోతుల నెహ్రూ.. ప్రజల సౌకర్యం కోసం పరిపాలన సౌలభ్యం కల్పించాలి కానీ.. ప్రజలను పరుగులు పెట్టించే పరిపాలన కోరుకోలేదు అన్నారు. 

రాజధాని పేరు అమరావతి ఇష్టం లేకపోతే.. వైఎస్ఆర్ నగరం అని పేరు మార్చుకోవాలని సీఎం జగన్ కు జ్యోతుల సూచించారు. వైఎస్ఆర్ పేరు పెట్టి రాజధానిని అభివృద్ధి చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ప్రజా రాజధానిని మార్చడం సరికాదని జ్యోతుల అన్నారు. రాజకీయ లబ్ది కోసం రాజధాని మార్చాలని అనుకోవడం బాధాకరం అన్నారు.

టీడీపీ నేతలు ఇలా అంటుంటే.. అధికార పార్టీ నేతలు ఎదురుదాడికి దిగారు. రాజధాని అమరావతి నుంచి తరలిస్తారనే వార్తలు దుమారం రేపుతుండగా.. దీనిపై స్పందించిన బొత్స.. రాజధాని ఎక్కడున్నా మాకు అభ్యంతరం కానీ ఇబ్బంది కానీ లేవని స్పష్టం చేశారు. కాగా, రూ.లక్ష కోట్లతో అమరావతి అభివృద్ధి అనేది అసాధ్యం అని బొత్స తేల్చి చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందాలన్నదే జగన్ ప్రభుత్వం లక్ష్యం అని బొత్స చెప్పారు.

మరోవైపు రాజధాని ప్రాంతంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ నిరసనలు కంటిన్యూ చేస్తున్నారు. మహిళలు, రైతులు, విద్యార్థులు పాల్గొంటున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని,  రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనలు, నిరసనల నేపథ్యంలో సచివాలయం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. సచివాలయం వైపు వెళ్లే రహదారిని ఆందోలనకారులు దిగ్భందించడంతో.. పోలీసులు అలర్ట్ అయ్యారు. ఐడీ కార్డులున్న వారిని మాత్రమే అటువైపు అనుమతిస్తున్నారు.

ఏపీకి 3 రాజధానులు అంటూ సీఎం జగన్ చేసిన ప్రకటన, GN RAO కమిటీ నివేదికతో అమరావతి ప్రజలు భగ్గుమన్నారు. తమకు మూడు రాజధానులు వద్దని, అమరావతే రాజధానిగా ఉండాలంటూ డిమాండ్ చేస్తూ 13 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో వారిని శాంతింప చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. రాజధానిపై నిర్ణయాన్ని వాయిదా వేసింది. హైపవర్ కమిటీని అపాయింట్ చేసింది. ఈ కమిటీ మూడు వారాల్లో నివేదిక ఇవ్వనుంది. ఆ నివేదికపై చర్చించాక… ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.