భంగపాటు తప్పదు : కేటీఆర్ కు కౌంటరిచ్చిన లోకేష్
అమరావతి : వచ్చే ఎన్నికల్లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని, చంద్రబాబు వందశాతం ఓడిపోతారని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చారు. “ఢిల్లీ మోడీ గారు, తెలంగాణ మోడీ కేసిఆర్ గారు, ఆంధ్రా మోడీ జగన్ గారికి కలలో కూడా చంద్రబాబు గారే గుర్తుకొస్తున్నారు అన్న విషయం ఈ రోజు కేటిఆర్ గారి మాటల్లో బయటపడింది. ఫెడరల్ ఫ్రంట్ అంటూ చక్రం తిప్పి 420 పార్టీతో జత కట్టిన కేసీఆర్ గారు తెలంగాణకే పరిమితమై చతికలపడ్డారు” అని ట్విట్టర్ లో పేర్కోన్నారు.
“ఒక్క నాయకుడిని ఎదుర్కోలేక ముగ్గురు నాయకులు ఒక్కటై ఎన్నో కుట్రలు చేస్తున్నారు. అభివృద్ధి,సంక్షేమం లో పోటీ పడలేక, జగన్ తో చేతులు కలిపి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసే భారీ ప్రణాళికలతో టీఆర్ఎస్ ముందుకొస్తున్న విషయం ఇవ్వాళ కేటీఆర్ మాటల్లో తేలిపోయింది. తెలుగుదేశం ఓటమి కోసం కృషి చేసే కేసీఆర్ ఆయన సహచరులకు భంగపాటు తప్పదు! ఇది తథ్యం!” అని లోకేష్ ట్వీట్ చేశారు.